హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ కర్నూలు | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ కర్నూలు

Apr 28 2025 1:11 AM | Updated on Apr 28 2025 5:01 PM

కదిరి అర్బన్‌: స్థానిక ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు ప్రసాద్‌ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహేష్‌తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఏడు కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,016 మంది విద్యార్థులకు గాను 1,757 మంది హాజరయ్యారు. కొనకొండ్ల కేంద్రంలో 600 మందికి 537 మంది, కుందుర్పిలో 300 మందికి 265, నార్పలలో 500 మందికి 460, గోనబావిలో 305 మందికి 251, డి.హీరేహాళ్‌లో 199 మందికి 156, అనంతపురంలో 77 మందికి 61, కళ్యాణదుర్గంలో 35 మందికి గాను 27 మంది విద్యార్థులు హాజరయ్యారని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్‌ జోనాథన్‌ తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. ఆయా పాఠశాలల నోటీస్‌ బోర్డుల్లోనూ జాబితాలను ఉంచుతామన్నారు.

చిరుతల సంచారం

గుడిబండ వాసుల ఆందోళన

గుడిబండ: మండల కేంద్రంలో చిరుతల సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం గ్రామానికి సమీపంలోని కొండపై చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు. చాలా కాలంగా కొండపై ఉన్న పొదల్లో చిరుతలు తిష్ట వేసి ఉన్నాయంటున్నారు. రాత్రి పూట నివాసాల వద్దకు వచ్చి పశువులు, మేకలు, గొర్రెలపై దాడి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులకు చాలా రోజుల నుంచి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో వైరల్‌ కేసులో నిందితుడికి రిమాండ్‌

మరో నలుగురిపై కేసు నమోదు

పరిగి: మతపరమైన అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్‌ చేసిన పరిగికి చెందిన ఓ యువకుడిని అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రంగడు యాదవ్‌ తెలిపారు. తెలంగాణకు చెందిన ఓ యువతి కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన వీడియోపై సదరు యువకుడు మతపరమైన దూషణకు పాల్పడడమే కాకుండా యువతిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ శనివారం పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై పోలీసులు సకాలంలో స్పందించి ఈ అంశం వివాదం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్‌ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకుని, ఆదివారం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అలాగే రెచ్చగొట్టేలా వీడియోను రూపొందించి వైరల్‌ చేసిన మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు.

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ కర్నూలు1
1/1

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement