
కాలువ గట్టునూ వదల్లేదు!
బొమ్మనహాళ్: అక్రమ సంపాదన కోసం టీడీపీ నేతలు ఆయకట్టు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏకంగా తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) గట్టు నుంచే మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. కాలువ గట్టు పటిష్టంగా ఉండాలంటే మట్టే ఆధారం. ఇదే మట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. హెచ్చెల్సీ అధికారులతో కుమ్మకై ్కన అధికార టీడీపీ నేతలు పట్టపగలే కాలువ గట్టుపై మట్టి తవ్వుతూ రోజుకు సుమారు 200 ట్రాక్టర్ల ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీనివల్ల గట్టు బలహీనపడి హెచ్చెల్సీకి గండ్లు పడే ప్రమాదముందని, అదే జరిగితే వేలాది ఎకరాల ఆయకట్టు భూములు బీడు పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కణేకల్లు మండల నేత దందా
కణేకల్లు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రెండు జేసీబీలు, 12 ట్రాక్టర్లను పెట్టి.. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామ శివారులోని హెచ్చెల్సీ కాలువ గట్టు నుంచి ఎర్రమట్టిని దాదాపు పది రోజులుగా తరలిస్తున్నారు. కణేకల్లు మండలంలోని మీండ్లపల్లి–నాగేపల్లి మార్గంలో హెచ్చెల్సీ వద్ద జీప్ట్రాక్ వేసేందుకు ఈ మట్టిని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..కాలువ గట్టును 8 నుంచి 10 అడుగుల వరకు తవ్వుతుండడంతో పూర్తిగా బలహీనపడి.. నీరు వచ్చినప్పుడు గండి పడే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి దందా హెచ్చెల్సీ అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు వారు చెబుతున్నారు.
వేరే మట్టితో నింపుతాం
మట్టి దందా విషయాన్ని హెచ్చెల్సీ డీఈఈ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లగా.. దర్గాహొన్నూరు గ్రామ శివారులోని హెచ్చెల్సీ గట్టుకు ఆనుకుని ఉన్న మట్టిని తరలించి.. అక్కడ వేరే మట్టితో నింపేస్తామని చెప్పారు. ఇకమీదట ఎవరైనా అక్రమంగా కాలువ గట్టు నుంచి మట్టిని తరలిస్తే చర్య లు తీసుకుంటామన్నారు.
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
హెచ్చెల్సీ గట్టు నుంచి యథేచ్ఛగా మట్టి తరలింపు