
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
అనంతపురం కార్పొరేషన్: ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ నగరపాలక సంస్థ సిబ్బందికి సూచించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పారిశుధ్యం మెరుగుకు సంబంధించి నగరపాలక సంస్థ, మునిసిపల్ కమిషనర్లకు కలెక్టర్ పలు సూచనలు, సలహాలిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం మెరుగు, తాగునీటి సరఫరా, వీధి లైట్లు తదితర ప్రజా అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని పక్కాగా అమలు చేయాల్సిందేనన్నారు. ప్రధానంగా నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అందరూ సమష్టిగా పని చేయాలని, పారిశుధ్య కార్మికులను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల పదోన్నతులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
ఇసుక నిల్వ చేయాలి
అనంతపురం అర్బన్:వర్షాకాలం నాటికి ఇసుక నిల్వలు 70 వేల టన్నులు ఉంచాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.