
గిన్నిస్ బుక్లో ‘అనంత’ వాసికి చోటు
అనంతపురం కల్చరల్: నగరానికి చెందిన మేరీ ప్రత్యూష గుజ్జారి... గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 2024, డిసెంబరు 1 హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి సంగీత కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 18 దేశాలకు చెందిన 1,046 మంది కీబోర్డు ప్లేయర్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో నగరానికి చెందిన ప్రత్యూష గుజ్జారితో పాటూ మరి కొందరి ఖ్యాతిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించి, హైదరాబాదులోని లైఫ్ చర్చిలో క్రైస్తవ పెద్దల ద్వారా సర్టిఫికెట్ను, జ్ఞాపికను అందజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యూష గుజ్జారి, ఆమె భర్త డేనియల్ జక్కం, మామ జెడ్.దేవరాజును పలువురు అభినందించారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
పుట్లూరు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం పోక్సో చట్టం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.