
బెల్టుషాపు నిర్వహణకు వేలంపాట
బ్రహ్మసముద్రం : టీడీపీ నేతలు అక్రమ సంపాదనకు అర్రులు చాస్తున్నారు. ఈ క్రమంలో మద్యం బెల్టుషాపులను ఆదాయ మార్గాలుగా ఎంచుకుంటున్నారు. వాటి కోసం ఆధిపత్య పోరుకు కూడా దిగుతున్నారు. కొన్నిచోట్ల వేలంపాట నిర్వహించి మరీ బెల్టుషాపులను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో బెల్టుషాపు నిర్వహణకు శుక్రవారం నిర్వహించిన వేలంపాట రసాభాసగా మారింది. మండలంలోని వేపులపర్తి గ్రామంలో లైసెన్స్డ్ మద్యం దుకాణం ఉంది. దీనికి అనుబంధంగా బ్రహ్మసముద్రంలో టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. అయితే..అన్ని బెల్టుషాపులు ఎత్తేసి ఒకే ఒకటి నిర్వహించాలని, దాన్ని కూడా వేలంపాట ద్వారా కేటాయించాలని టీడీపీ నాయకులు భావించారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సమావేశమయ్యారు. వేలంపాట విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వేలం పాట నిర్వహించాలని కొందరు..అవసరం లేదని మరికొందరు వాదనకు దిగారు. ఇది కాస్తా పెద్దదయ్యి తోసుకునే స్థాయికి వెళ్లింది. చివరకు కొందరు నాయకులు కలుగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వద్ద పంచాయితీ చేద్దామంటూ వేలంపాటను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలను ఆసక్తిగా గమనించిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఏదో అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే ఇప్పుడిలా మద్యం ఆదాయం కోసం కొట్టుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానించారు.
తోపులాటకు దిగిన ‘తమ్ముళ్లు’