
ట్రెజరీలో అడ్డగోలు బదిలీలు
విశాఖ సిటీ: జిల్లా ఖజానా శాఖలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా బదిలీల ప్రక్రియను ముగించారంటూ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, సబార్డినేట్లకు సంబంధించిన బదిలీలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు?
సాధారణంగా ఒకే చోట ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలి. అంతేకాకుండా, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. అయితే జిల్లా ఖజానా శాఖలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా, స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కనుసన్నల్లో 34 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఐదేళ్లు పూర్తయినా అక్కడే కొనసాగింపు
ఈ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 12 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించలేదని సమాచారం. దీనికి తోడు, ఖజానా శాఖలో ఐదేళ్లుగా జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బదిలీ చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సదరు జూనియర్ అకౌంటెంట్పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలువురు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. అయినప్పటికీ, ఆరోపణలను, ఐదేళ్ల నిబంధనను పట్టించుకోకుండా అతడిని బదిలీ చేయకపోవడం పట్ల ఆ శాఖ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
డీటీవో సంతకం చేసి సెలవుపై..?
ఈ బదిలీల ఫైల్పై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ (డీటీవో) నాగభూషణం సంతకం చేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినట్లు సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
కౌన్సెలింగ్ నిర్వహించకుండా
34 మందికి స్థానచలనం
ఐదేళ్ల నిబంధనను పట్టించుకోని
అధికారులు