
విద్యార్థుల ప్రతిభకు తార్కాణమే ‘స్పెక్ట్రమ్’
విశాఖ విద్య: విద్యార్థుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా ‘స్పెక్ట్రమ్’ప్రదర్శన నిలిచిందని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం బీఎఫ్ఎం, ఎంఎఫ్ఏ విద్యార్థుల వార్షిక చిత్రకళా ప్రదర్శన స్పెక్ట్రమ్– 2025ను శుక్రవారం వీసీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు, చిత్రాలు ఆయన తిలకించి అభినందించారు. విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో కళాఖండాలను తీర్చిదిద్దారని ప్రశంసించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్రకళా విభాగం విద్యార్థులను భాగస్వాములు చేస్తూ ఒక ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు, చిత్రాలను నిశితంగా పరిశీలించి.. వాటి వెనుక ఉన్న భావాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విభాగాధిపతి డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.