10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన | - | Sakshi
Sakshi News home page

10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన

May 31 2025 1:33 AM | Updated on May 31 2025 1:33 AM

10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన

10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన

మహారాణిపేట: నగరంలో జూన్‌ 10వ తేదీన జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో శుక్రవారం గిరిజన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ టి.వి.కట్టిమణితో కలిసి వివిధ అంశాలపై సమీక్షించిన కలెక్టర్‌.. కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి జూన్‌ 10వ తేదీ ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాలుకు చేరుకుంటారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమం అనంతరం, ఆమె రోడ్డు మార్గం ద్వారా విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూచించారు. రోడ్డు మార్గంలో రానున్న నేపథ్యంలో సుందరీకరణ పనులు, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జ్ఞానాపురం రైల్వే అండర్‌ పాస్‌ వద్ద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ వర్షం పడినట్లయితే మోటార్ల ద్వారా నీటిని తొలగించాలని జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి కన్వెన్షన్‌ హాలు వరకు ఎలాంటి హోర్డింగులు, విద్యుత్‌ తీగలు, ఇతర అడ్డంకులు లేకుండా తొలగించాలని సూచించారు. ఏయూ కన్వెన్షన్‌ హాలు వద్ద సీటింగ్‌ ఏర్పాట్లు, ప్రోటోకాల్‌ నిబంధనలు పక్కాగా ఉండేలా చూసుకోవాలన్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రానున్న క్రమంలో ప్రత్యేక గ్రీన్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు మార్గంలో, ఏయూ కన్వెన్షన్‌ హాలు వద్ద పారిశుధ్య పరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, డీఆర్వో బిహెచ్‌ భవానీ శంకర్‌, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్‌ మాధుర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement