
మామిడిని సహజంగా మగ్గించాలి
కశింకోట: ఆరోగ్యం కోసం కోత కోసిన మామిడి కాయలను సహజంగా మగ్గించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి.ప్రభాకర్ రైతులకు సూచించారు. మండలంలోని బయ్యవరంలో శుక్రవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పంటల సాగులో మెలకువలు, యాజమాన్య పద్ధతుల గురించి అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్వానికి వచ్చిన తర్వాత మామిడి కాయలను కోసి సహజంగా మగ్గించాలన్నారు. పక్వానికి రాకుండా కాయలు కోసి విషపూరితమైన రసాయనాలు కలిగిన కాల్షియం కార్బైడ్, తదితర మందులు వాడి మగ్గించరాదన్నారు. ఇలా అసహజంగా మగ్గిన పండ్లు తినడం ఆరోగ్యకరం కాదన్నారు. ఇవి ఎక్కువ నిల్వ కూడా ఉండవన్నారు. మామిడి సాగులో అధికారులు సూచించిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏటా ఆశించిన దిగుబడులు సాధించవచ్చునన్నారు. జీడిమామిడిలో యాజమాన్య పద్ధతులను వివరించారు. జిల్లా రిసోర్స్ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకుడు సిహెచ్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విత్తన శుద్ధి పాటించి వరి సాగు చేపట్టాలన్నారు. భూమి సారవంతం కోసం ముందుగా పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కలియ దున్నాలన్నారు. మండల వ్యవసాయ అధికారి ఎం.స్వప్న మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యానవన విస్తరణ అధికారి ప్రవీణ మాట్లాడుతూ తమ శాఖ వద్ద కొబ్బరి, మామిడి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, వీటిని వర్షాల సమయంలో నాటుకోవాలని సూచించారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం భూసార శాస్త్రవేత్త బి.శ్రీహరిరావు మాట్లాడుతూ సహజ సిద్ధమైన ఎరువులు వాడడం ద్వారా భూముల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునన్నారు. పశువైద్య శాస్తవేత్త డాక్టర్ విజయరాజ్ఞి మాట్లాడుతూ పశుగ్రాసం సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు.