
రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు
అర్జీల గతి ఇంతేనా?
● మూడుసార్లు దరఖాస్తు చేసిన రైతు
● 7 నెలలు దాటినా లభించని పరిష్కారం
మునగపాక: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా సామాన్యుల సమస్యలు తీరడం లేదు. ఈ వ్యవస్థ మొక్కుబడిగా నడుస్తోందని, తమలాంటి వారికి న్యాయం జరగడం లేదని మునగపాకకు చెందిన రైతు పీలా అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. మునగపాక పంచాయతీ కార్యాలయంలో గత ఏడాది అక్టోబర్ 19న తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో అప్పారావు రీ–సర్వేలో జరిగిన తప్పును సవరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల్లోగా సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ ఆరోజున చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అప్పారావు ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులను మరోసారి కలిసి తనకు న్యాయం జరగలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 19న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మరోసారి దరఖాస్తు చేశారు. అనంతరం వీఆర్వోను కలిసి తన ఫిర్యాదు గురించి వివరించారు. ప్రస్తుతం యాప్ ఓపెన్ కావడంలేదని వీఆర్వో చెబుతున్నారని, గత అక్టోబర్లో యాప్ పనిచేసిన సమయంలో తన సమస్యను పరిష్కరించి ఉంటే తన సమస్య తీరేదని అప్పారావు వాపోతున్నారు. రీ–సర్వే సవరణ కోసం తాను దరఖాస్తు చేసుకుంటే పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే గాని సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారే గాని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి తనకు తగు న్యాయం జరిగేలా చూడాలని అప్పారావు కోరుతున్నారు.

రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు