
దారీ తెన్నూ లేని పాలన!
అడుగుకో గుంత.. హామీలు గోవింద
రహ‘దారి’ద్య్రం
● అవి రోడ్లు కాదు.. నరకదారులు ● సంక్రాంతి నాటికి గోతులు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామనిసీఎం ప్రకటన ● నాలుగు నెలలు దాటినా అదే దుస్థితి ● వర్షాలతో చిత్తడిగా మారుతున్న రోడ్లు
సాక్షి, అనకాపల్లి: గుంతలు పూడ్చడమే కాదు ఆర్ అండ్బీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొన్ని చోట్ల కొత్త రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. కొత్త రోడ్ల మాట దేవుడెరుగు.. జిల్లాలో గుంతలనే పూడ్చిన పాపానపోలేదు. మూడు జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన రహదారి రోలుగుంట– చోడవరం రోడ్డులో అడుగుకో గుంత ఏర్పడి.. వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల రహదారులు మరింత దారుణంగా ఉన్నాయి. దేవరాపల్లి నుంచి గిరిజన పంచాయతీ వాలాబు వెళ్లే రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల మేర అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరింత తీసికట్టుగా ఉంది. తాండవ రిజర్వాయరుకు వెళ్లే మార్గం గుంతలు గుంతలుగా అధ్వానంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి అనిత శంకుస్థాపన చేయగా ఐదు దఫాలుగా పనులు మొదలు పెట్టి ఆపేశారు. ఇందేశమ్మవాక రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం. అనకాపల్లి, కశింకోట మండలాల్లో ప్రధానంగా అనకాపల్లి–మామిడిపాలెం, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ రోడ్డు, కుంచంగి, తగరంపూడి,వెంకుపాలెం పంచాయతీ పరిధిలో వేసిన రహదారులు నాణ్యత లేని కారణంగా పూడ్చిన రెండు నెలల్లోనే మళ్లీ గుంతలుగా దర్శనమిచ్చాయి. ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టులో జిల్లాలోని రహదారులు, వాటిపై గోతులు, ఆ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజల అవస్థలు వెలుగు చూశాయి.
భారీ గోతులతో ఛిద్రమైన దేవరాపల్లి–వాలాబు రోడ్డు
సీ కేటగిరి రోడ్లు టెండర్ దశలో ఉన్నాయి..
జిల్లాలో ఆర్అండ్బీ విభాగం నుంచి ఏ– కేటగిరిలో 123 పనులకు రూ.5.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అవి మొత్తం పూర్తయిపోయాయి. ఎన్డీబీ రోడ్లు కాకుండా మిగతావి మూడు కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరి లో అత్యవసరంగా రోడ్లకు ప్యాచ్ వర్కు చేసేవి. బీ– కేటగిరిలో స్టెచ్లు పోయిన రోడ్లు, సీ–కేటగిరిలో బాగా పాడైపోయిన రోడ్లు, ప్యాచ్ వర్క్స్తో పూర్తికానటువంటివి. ప్రస్తుతం ఏ–కేటగిరిలో మంజూరైన 123 పనులు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. బీ–కేటగిరి, సీ–కేటగిరిలో ఉన్న రోడ్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి. రోలుగుంట–చోడవరం రోడ్డు ఎన్డీబీ రోడ్డు. దీనికి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. టెండర్ ప్రక్రియ అంతా గతంలోనే పూర్తయింది.
– ఎస్.ఆర్.ఎన్.వి రమేష్, ఆర్ అండ్ బీ ఈఈ, అనకాపల్లి జిల్లా

దారీ తెన్నూ లేని పాలన!

దారీ తెన్నూ లేని పాలన!