
వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రథమ బహుమతి అందుకుంటున్న విద్యార్థులు
● 95 శాతం క్షిపణులు, టార్పిడోలు దేశీయంగానే తయారు కావడం గర్వకారణం ● డైరెక్టర్ శ్రీనివాసరావు
గోపాలపట్నం: ఎన్ఎస్టీఎల్లో మూడు రోజులుగా జరుగుతున్న సాంకేతిక దినోత్సవ వేడుకలు గురువారంతో ఘనంగా ముగిసాయి. సంస్థ డైరెక్టర్ వై. శ్రీనివాసరావు తొలుత అబ్దుల్ కలామ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల నిరంతర కృషితో ఎన్ఎస్టీఎల్ అభివృద్ధిపథాన దూసుకుపోతుందని అన్నారు. 95 శాతం క్షిపణులు, టార్పిడోలు దేశీయంగానే తయారు కావడం మనకు గర్వకారణం అన్నారు. ఈ ఓపెన్ హౌస్ ప్రదర్శనను 6,200 మందికి పైగా విద్యార్థులు సందర్శించారని తెలిపారు. ప్రొఫెసర్ డీవీఎల్ఎన్ సోమయాజులు అధునాతన వ్యవస్థల అభివృద్ధి, గ్రోబల్ టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ జీఎన్ రావు లాఫింగ్ బుద్ధా అనే కోడ్ నేమ్తో ఆపరేషన్ శక్తిని మే 1998లో, మిషన్ శక్తిని 2019లో ఎలా అమలు చేశారో వివరించారు. ఎన్ఎస్టీఎల్ సైంటిస్ట్ ఆనంద్కుమార్కు టైటానియం అవార్డును డైరెక్టర్ శ్రీనివాసరావు అందించారు. ‘బెస్ట్ టార్పిడో రిలీజ్ మెకానిజం’అనే అంశంపై చేసిన ప్రసంగానికి ఆయన ఈ మెడల్ దక్కించుకున్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో
విద్యార్థులకు బహుమతులు
జాతీయ సైన్స్డే సందర్భంగా ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. సృజనవాణి వాలంటరీ అసోసియేషన్ ద్వారా విద్యార్థులు చేపట్టిన ఐవోటీ బేస్డ్ స్మార్ట్ అగ్రికల్చర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్కు మొదటి బహుమతి వచ్చింది. విద్యార్థులు టి. తేజస్విని, వై. జస్వంత్కు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. రెండో బహుమతి రివర్ రాగ్ రిమూవర్కు, మూడో బహుమతి ఆక్వాఫోనిక్స్ ప్రాజెక్టుకు దక్కాయి. కళాశాల విభాగంలో దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు జి. జయశంకర్రెడ్డి, ఎ. దినేష్కుమార్ రూపొందించిన లైట్ ట్రాన్స్మిటింగ్ కాంక్రీట్ బ్రిక్ మొదటి బహుమతి దక్కించుకుంది. రెండు బహుమతులు విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు పొందారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు పీవీఎస్ గణేష్కుమార్, బీవీఎస్ఎస్ కృష్ణకుమార్, శాస్త్రవేత్తలు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
