
సాగుకేది ‘నీటి వసతి’..?
● దళితబస్తీ భూముల వైపు చూడని ప్రభుత్వం ● సాగుదారులకు తప్పని ఇబ్బందులు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
ఆదిలాబాద్అర్బన్: భూమిలేని నిరుపేదలను సాగుదారులుగా మార్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దళిత బస్తీ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గుంట భూమిలేని మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పిస్తూ మూడెకరాల భూమిని పంపిణీ చేసింది. భూముల కొనుగోలు సమయంలో కొన్ని భూముల్లో అప్పటికే బోర్లు, బోరుబావులు ఉన్నా యి. అయితే నీటి వసతి లేని భూముల్లో కొత్త బోర్లు వేయాలని ఎస్సీ కార్పోరేషన్ అధికారులకు జిల్లాలో వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపట్టారు. నివేదిక తయారు చేసి భూగర్భజల శాఖ అధికారులకు వాటర్ సర్వే నిమిత్తం పంపించారు. నీటి సర్వే చేసిన గ్రౌండ్ వాటర్ అధికారులు ఆ వివరాలను ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు పంపించారు. అప్పుడు అర్హుల జాబితా తయారు చేసి కలెక్టర్ ఆమోదం తీసుకుని ఆరు నెలల క్రితం మంజూరు కోసం ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు స్పందన లేదు.
ప్రస్తుతం సాగునీటి వసతి ఇలా..
ప్రభుత్వం భూములు కొన్న సమయంలో అప్పటికే ఆయా భూముల్లో కొన్నింటికీ సాగునీటి బోర్లు, బోరుబావులు ఉన్నాయి. భూములు అమ్మిన యాజమానులు ఆయా బోర్లకు, బోరుబావులకు ఉన్న మోటర్లు, పైపులు, విద్యుత్ వైర్లు తీసుకెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులే సొంతంగా మోటర్లు, పైపులు కొనుగోలు చేసి సాగునీటిని పంటలకు అందిస్తూ వస్తున్నారు. అయితే భూములకు సరిపడా సాగునీరు లేకపోవడంతో ముగ్గురు లబ్ధిదారులకు (తొమ్మిది ఎకరాలకు) కలిపి ఒక్కో సాగునీటి బోర్ను అధికారులు కేటాయించారు. భూ పంపిణీ చేసినప్పటి నుంచి ఆయా బోర్లనుండి సాగునీటిని వినియోగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎండాకాలంలో భూగర్భజలాలు అడుగంటడంతో రబీ సీజన్లో ఒక లబ్ధిదారు(మూడు ఎకరాలు) సాగు చేసే పంటకే నీరు సరిపోతుంది. మిగతా ఇద్దరు రైతులు సీజన్లో పంటలు వేయలేని పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ భూముల్లో సైతం సాగునీటి బోర్లు వేయాలని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
క్షేత్రస్థాయిలో భూముల పరిశీలన..
బోర్వెల్ల కోసం లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు ఎవరెవరి భూముల్లో నీటి వసతి లేదో వారి జాబితాను సిద్ధం చేశారు. దాని ప్రకారం నీటి వసతి కోసం డ్రిల్లింగ్ చేసేందుకు బోర్ పాయింట్లు గుర్తించాలని భూగర్భజల శాఖ అధికారులకు నివేదిక అందజేశారు. కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం భూగర్భజల శాఖ అధికారులు లబ్ధిదారుల భూముల్లోకి వెళ్లి గ్రౌండ్ వాటర్ సర్వే చే పట్టారు. ఆ సమయంలో వాటర్ సర్వే మిషన్లు జి ల్లాలో అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తెప్పించి మరీ సర్వే చే శారు. ఒక్కో రోజుకు 25 ఎకరాల నుంచి 30 ఎకరా ల వరకు సర్వే చేసి బోర్వెల్ పాయింట్లు గుర్తించా రు. గుర్తుగా రాళ్లు, రాడ్లు, బండలను పాతారు. అ లా సర్వే చేసిన అధికారులు ఆ వివరాలను ఎస్సీ కార్పోరేషన్కు అధికారులకు పంపించారు. పరిశీ లించిన అధికారులు ఎవరెవరి భూముల్లో బోర్లు వేయాలో ఆ వివరాలు సిద్ధంచేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం మంజూరు నిమిత్తం ఆ శాఖ కమిషనరేట్కు పంపారు. కాగా జిల్లాలో జైనథ్, బేల, భీంపూర్, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్, బజార్హత్నూర్, తదితర మండలాల్లో కొన్నిచోట్ల కొత్త బోర్లు వేయగా మరికొంత మంది భూముల్లో గ్రౌండ్ వాటర్ సర్వే చేయాల్సి ఉంది.
ప్రతిపాదనలు పంపించాం
దళితబస్తీ పథకం కింద భూములు పొందిన లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బోర్లు వేయాలని నిర్ణయించాం. ఆరునెలల క్రితం 600 బోర్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే లబ్ధిదారుల భూముల్లో కొత్తగా బోర్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం నిమిత్తం కూడా ప్రభుత్వానికి నివేదించాం.
– మనోహర్రావు, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్