
● జీపీఏ ఆధారంగా పక్కదారి.. ● ఆదిలాబాద్ పట్టణంలో మాయాజా
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత మే 31న ఓ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఒకే ఒక డాక్యుమెంట్లో ఒక లేఅవుట్లోని 80 ప్లాట్లు ఈ దస్తావేజులో రిజిస్ట్రేషన్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ లేఅవుట్కు డీటీసీపీ అనుమతి లేదని, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోలేదని, లొసుగులను ఆధారంగా చేసుకుని అలాంటి ప్లాట్లను జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) ద్వారా వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ డాక్యుమెంట్ విషయంలో కొంతమంది ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదం ఇలా..
ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్లో 59 సర్వే నంబర్లో ఓ లేఅవుట్ను కొంతమంది రియల్టర్లు రూపొందించారు. దీనికి డీటీసీపీ అనుమతి లేదు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కూడా చేయలేదు. అలాంటి పరిస్థితిలో ఈ లేఅవుట్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేదు. దీంతో ఆ రియల్టర్లు ఎత్తుగడ వేసి వాటిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటు డీటీసీపీ లేకపోవడం, అటు ఎల్ఆర్ఎస్ లేకపోవడంతో ఆ రియల్టర్లు ఆ పట్టాదారు మరో వ్యక్తికి ఆ లేఅవుట్పై జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) ఇవ్వడం జరిగింది. దాని డాక్యుమెంట్ ఆధారంగా ఈ అనధికారిక లేఅవుట్లోని ప్లాట్లను గంపగుత్తగా ఒకే డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ సబ్రిజిస్ట్రార్కు పెద్ద మొత్తంలో మామూళ్లు అందడంతోనే ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని జిల్లా అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.