
● రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు.. ● రూ.68 కోట
సాక్షి,ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాగ్పూర్ మీదుగా హైదరాబాద్కు వెళ్లే దారిలో ఎన్హెచ్ 44పై మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ జాతీయ రహదారి సుమారు 80 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ రహదారిపై సరైన వెహికిల్ అండర్పాస్ లు, సర్వీస్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణ కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా పరిధిలో వివిధ పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి.
గుడిహత్నూర్, సీతాగోంది వద్ద అండర్పాస్లు..
గుడిహత్నూర్ వద్ద కిలోమీటర్ మేర అండర్పాస్లు నిర్మించనున్నారు. సీతాగోంది వద్ద కూడా కిలోమీటర్ మేర ఆరువరుసల అండర్పాస్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ హైవే వెంబడి పలుచోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత వెహికిల్ అండర్పాస్ నిర్మించనున్నారు. ప్రధానంగా సరైన వెహికిల్ అండర్పాస్లు లేకపోవడంతో హైవేను ఒకపక్క నుంచి మరో పక్కకు దాటే విషయంలో గ్రామాల వద్ద పలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది. అంతేకాకుండా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అండర్పాస్ల నిర్మాణం పూర్తయితే జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జాతీయ రహదారి 44పై పెరుగుతున్న ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమైంది. జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న హైవేకు సంబంధించి రూ.68 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈనెల 5న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్న కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చేతుల మీదుగా అక్కడ ప్రారంభోత్సవాలు జరగనుండగా జిల్లా పనులకు సంబంధించి శంకుస్థాపన వారి చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి జరగనుంది.
మావల వద్ద సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్..
మావల వద్ద సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులను ఇటీవలే మొదలుపెట్టారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హైవే నుంచి కిందికి దిగి గ్రామానికి వెళ్లే సందర్భంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వీస్ రోడ్ నిర్మాణంతో ఇక్కడ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.
ఈ సంవత్సరంలోగా పూర్తి..
ఈ పనులను ఈ సంవత్సరంలోగా పూర్తి చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పలు రహదారుల ప్రారంభోత్సవాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించేందుకు కేంద్ర మంత్రులు ఈనెల 5న ఆసిఫాబాద్ రానున్నారు. ఆదిలాబాద్కు సంబంధించిన పనులను అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.
– శ్రీనివాస్, పీడీ, ఎన్హెచ్ఏఐ, కామారెడ్డి
అంచనా వ్యయాలు ఇలా..
వర్క్ అంచనా వ్యయం
గుడిహత్నూర్ (అండర్పాస్) : రూ.24 కోట్లు
సీతాగోంది (అండర్పాస్) : రూ.26 కోట్లు
మావల (సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్) :
రూ.18 కోట్లు