-
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
వైజాగ్ స్కూల్ ఆటో ఘటన.. విజయవాడ RTA అలర్ట్
-
ఆర్టీఏలో అల్లరి నరేష్
హైదరాబాద్: సినీ నటుడు అల్లరి నరేష్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ మోటారు వాహన నిబంధనల మేరకు వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అల్లరి నరేష్ తన ఖరీదైన కొత్త కియా ఈవీ–6 బ్యాటరీ కారు కోసం ప్రత్యేక నంబర్ను సొంతం చేసుకున్నారు. టీఎస్ 09 జీబీ 2799 నంబర్ కోసం ఆయన ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.94,899 చెల్లించి నంబర్ దక్కించుకున్నారు. -
ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవలే ఆయన కొత్తగా ఖరీదైన ఎలక్ట్రిక్ కారు(ఈవీ)ని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు రూ.34.5 లక్షలతో కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా టీఎస్09 జీబీ2628 అనే ఫ్యాన్సీ నంబర్ను 17,628 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. కారు ప్రత్యేకతలు ఇవే రవితేజ తాజాగా కొనుగోలు కారులో ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. చైనాకు చెందిన ఈ కారు అత్యంత సురక్షితమైందిగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్రూఫ్, పవర్డ్ టెయిల్గేట్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా దీనికి పేరుంది. కాగా.. రవితేజ ఇటీవలే రావణాసుర సినిమాతో అభిమానులను అలరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. మూవీకి మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్ను చాటుకున్నారు. ప్రతి సిరీస్లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్జడ్ 9999’ నెంబర్కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్నాయక్ తెలిపారు. -
ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులపైన నిఘా కొరవడింది. సాధారణంగా ఒకసారి లైసెన్సు రద్దయ్యాక ఆరు నెలల పాటు సదరు వాహనదారుడు బండి నడిపేందుకు వీలులేదు. 6 నెలల అనంతరం తిరిగి డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించుకున్న తరువాత మాత్రమే వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఆర్టీఏ, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా లైసెన్సుల రద్దు ప్రక్రియ ఉత్తుత్తి ప్రహసనంగా మారింది. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపైన ఏటా వేల సంఖ్యలో లైసెన్సులు రద్దవుతున్నాయి. కానీ ఇలా రద్దయిన వాహనదారులు యధేచ్చగా రోడ్డెక్కేస్తూనే ఉన్నారు. మరోవైపు మోటారు వాహన నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం కానీ, హెచ్చరికలు రద్దయినట్లు సదరు వాహనదారులకు అందకపోవడం వల్ల అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. రద్దులోనూ జాప్యం... నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇలా వరుసగా డ్రంకెన్ డ్రైవ్లలో పట్టుపడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఆర్టీఏను సంప్రదిస్తారు. ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ అధికారులకు డేటా అందజేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న లైసెన్సుల వివరాలను ఎప్పటికప్పుడు రవాణాశాఖకు చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. ఉదాహరణకు జనవరిలో పట్టుకున్న నిందితుల డేటాను మార్చి నెలలో ఆర్టీఏకు చేరవేస్తున్నారు. దీంతో మార్చి నుంచి 6 నెలల పాటు అమలయ్యే విధంగా ఆర్టీఏ సదరు డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తుంది. కానీ జనవరిలో పట్టుబడిన నిందితులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి యధావిధిగా తిరుగుతున్నారు. మార్చి నుంచి ఆరు నెలల పాటు రద్దయిన సమాచారం కూడా వాహనదారులకు సకాలంలో అందడం లేదు. ఎం–వాలెట్లో చూడాల్సిందే... రద్దయిన డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ఆర్టీఏ ఎం–వాలెట్లో మాత్రమే నమోదవుతున్నాయి. ఎం–వాలెట్ యాప్ కలిగి ఉన్న వాహనదారులు ఆ యాప్లో తమ డ్రైవింగ్ లైసెన్సు ఏ స్థితిలో ఉందో తెలుసుకుంటే మాత్రమే సస్పెండ్ అయినట్లుగా నోటిఫికేషన్ కనిపిస్తుంది. కానీ పోలీసులు, ఆర్టీఏ నిఘా లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా యధేచ్చగా రోడ్డెక్కుతున్నారు. (చదవండి: పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..) -
ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం.. 9999 @ రూ.10,49,999
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల వేలం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం కురిపించింది. బుధవారం నిర్వహించిన వేలం పాటలో పలు ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా మొత్తంగా రూ.30.83 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందని చెప్పారు. టీఎస్ 09 ఎఫ్వీ 0009 నంబరును రూ.3,50,0005 చెల్లించి సీహెచ్ అనంతయ్య అనే వినియోగదారుడు దక్కింకుకున్నారని పేర్కొన్నారు. టీఎస్ 09 ఎఫ్వీ 0001 నంబరును రూ,3,50,000కు రేజర్ గేమింగ్ సంస్థ దక్కించుకుందని తెలిపారు. వీటితోపాటు పలు ఇతర నంబర్లను కూడా వేలం వేశామని చెప్పారు. -
ఆర్టీఏకు వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కోసం ఆయన నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావడం గమనార్హం. రవాణా కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు, హైద రాబాద్ జేటీసీ పాండురంగ నాయక్, ప్రాం తీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు చీఫ్ జస్టిస్కు సాదరస్వాగతం పలికారు. నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితిని పునరుద్ధరించి అందజేశారు. -
నిబంధనలకు విరుద్దంగా నడిచే పాఠశాలల బస్సుల పై చర్యలు
-
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రస్తుత కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఆన్లైన్ ద్వారా సేవలందించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా అందించడానికి ‘ఎక్కడైనా - ఎప్పుడైనా (ఎనీవేర్ - ఎనీటైమ్)’ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీ-యాప్ ఫోలియో ద్వారా సేవలు అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు బుధవారం తెలియజేశారు. పౌరులు తమ స్మార్ట్ మొబైల్ ఫోన్ల నుంచి 17 రకాల సేవలను యాక్సెస్ చేయవచ్చు అని ఈ సేవల కోసం రవాణా లేదా ఆర్టీఏ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు అని అన్నారు. టీ-యాప్ ఫోలియో యాప్ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. టీ-యాప్ ఫోలియో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకొని తర్వాత మీకు కనిపించే ఆర్టీఏ ఐకాన్పై క్లిక్ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి. అందులో మనకు అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్ లైసెన్స్, ఇష్యూ ఆఫ్ బ్యాడ్జ్, స్మార్ట్కార్డు, లైసెన్స్ హిస్టరీ షీట్, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ పర్మిట్, పర్మిట్ రెన్యువల్, టెంపరరీ పర్మిట్ వంటి 17 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. చదవండి: జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్ పెంపు -
డ్రైవింగ్ లైసెన్స్.. తప్పదు వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో స్మార్ట్కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్ హైదరాబాద్లో లక్షకు పైగా వినియోగదారులు స్మార్ట్కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు. సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం. స్మార్టు కార్డులను తయారు చేసి, అందజేసే కాంట్రాక్ట్ సంస్థలకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయీలు చెల్లించకపోవడం వల్లనే 2 నెలలుగా కార్డుల ప్రింటింగ్, పంపిణీని ఆ సంస్థలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో రవాణాశాఖ అధికారులు తాజాగా మరో సంస్థతో ఒప్పందానికి చర్యలు చేపట్టారు. కానీ ఈ ఒప్పందం ఏర్పడి కార్డులు తయారు చేసి అందజేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపిణీ చేపట్టినా వినియోగదారులకు చేరేందుకు మరో 15 రోజులకు పైగా సమయం పట్టవచ్చునని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. (పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?) సందట్లో సడేమియా.. గత 3 సంవత్సరాలుగా స్మార్ట్కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలలతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘నిబంధనల ప్రకారం అన్ని రకాల ఫీజులు, పోస్టల్ చార్జీలు చెల్లించిన తరువాత కూడా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులిస్తే తప్ప కార్డులు రావడం లేదని’ టోలిచౌకికి చెందిన అనిల్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది దళారులే కార్డుల కొరతను సాకుగా చూపుతూ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఇదే ఒక దందాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: వ్యాక్సిన్పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
వాహన సామర్థ్య పరీక్ష కేంద్రం నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాహనాల శాస్త్రీయ ఫిట్నెస్ పరీక్షా కేంద్రం (ఐ అండ్ సీ) నిర్మాణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ కేంద్రం నిర్మాణంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. విశాఖ నగర సమీపంలో గంభీరం వద్ద ఏర్పాటు చేయనున్న ఐ అండ్ సీ (ఇన్స్పెక్షన్ అండ్ సెంటర్) నిర్మాణానికి కేంద్రం గతంలోనే రూ.16.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల విలువైన భూమిని కేంద్రానికి అప్పగించింది. ఇందులో అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్తోపాటు వాహనం బ్రేక్ నుంచి హెడ్లైట్లు, కాలుష్య స్థాయిలు, స్టీరింగ్ సామర్థ్యం, టైర్లు, సీటింగ్ స్థానాలు వంటి ఇతర ముఖ్యమైన భాగాలను తనిఖీ చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ మోటార్ వాహన ఫిట్నెస్ పరీక్షలు అవసరం లేకుండా చేస్తుంది. రాష్ట్ర విభజనతో ఏపీకి ఐ అండ్ సీ మంజూరు.. ► కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో ఐ అండ్ సీని మంజూరు చేసింది. గత ప్రభుత్వం దీని ఏర్పాటును పట్టించుకోలేదు. ► ఈ నెలలో సీఎం వైఎస్ జగన్తో శంకుస్థాపన చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ► నిర్మాణం తర్వాత ఈ కేంద్రాన్ని పుణెకు చెందిన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) తొలి ఏడాది నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఆర్టీఏ అధికారులకు అవసరమైన శిక్షణ ఇచ్చి రవాణా శాఖకు అప్పగిస్తుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఉత్తరాంధ్రలో దాదాపు 250 వాహనాలకు పైగా ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్గా నిర్వహిస్తున్నారు. ► నిబంధనల ప్రకారం రవాణా వాహనాలు ట్రక్కులు, క్యాబ్లు, పాఠశాల బస్సులు సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఈ సెంటర్లో కంప్యూటర్ ఆధారితంగా దాదాపు 30 నుంచి 40 ఫిట్నెస్ పరిమితుల్లో వాహనాల తనిఖీ జరుగుతుంది. ► పాఠశాల బస్సులు, భారీ రవాణా వాహనాలకు సరైన ఫిట్నెస్ లేని కారణంగా చాలావరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడంలో ఐ అండ్ సీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. -
వాహనాల వేలం ఎప్పుడో..?
ఖిలా వరంగల్: ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో రవాణాశాఖ అధికారులు, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పుపడుతున్నాయి. ఇలాంటి వాహనాలు ఒకటో రెండో ఉన్నాయనుకుంటే పొరపడినట్లే..!. కొన్ని వందల ఆటోలు, ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలు ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంలో తుప్పిపట్టి శిథిలమయ్యాయి. దీంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అయింది. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల్లో.. వివిధ కారణాలతో పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది సీజ్ చేసిన వాహనాలను రవాణాశాఖ సీక్ యార్డుకు తరలిస్తారు. వీటిని విడిపించుకోవడానికి యజమానులకు శాఖ నిబంధనల మేరకు ఆరు నెలలు సమయం ఉంటుంది. విడిపించుకోలేకపోతే ఆరు నెలలు తర్వాత ఆయా వాహనాలను వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ అధికారులు ఆ మేరకు వ్యవహరించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో వేలం నిర్వహించిన దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, నాలుగున్నరేళ్లుగా వాహనాలు ఒకేచోట ఉండటంతో తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. సీజ్ చేసిన సమయంలో బాగా నడిచిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు వాటిని విక్రయించాలన్నా అమ్ముడుపోని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వేలంలో విక్రయించినా వాటిపై ఉన్న ట్యాక్స్, పెనాల్టీలు, ఇతర జరిమానాలు మొత్తం కలిపిన శాఖకు 50 శాతం కూడా రెవెన్యూ వచ్చేలా లేదు. సకాలంలో వాహనాలను వేలం వేసి ఉంటే పూర్తి సొమ్ము ఖజానాకు జమ అయ్యేదని పలువురు పేర్కొంటున్నారు. కమిషనర్కు నివేదిక అందజేస్తాం.. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు, రోడ్డు టాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంకు తరలిస్తాం. వాహన యజమానలు ఆరు నెలల్లోపు జరిమానా చెల్లించి విడిపించుకునే వీలుంటుంది. అలా తీసుకోకపోతే వారి చిరునామాకు మూడుసార్లు నోటీసులు పంపుతాం. అయినా స్పందించకపోతే ప్రకటన ద్వారా వాటిని వేలం నిర్వహించి విక్రయిస్తాం. ప్రస్తుతం నాలుగేళ్లలోపు సీజ్ చేసిన వాహనాలే కార్యాలయ ప్రాంగణంలో ఉన్నావి. డీటీసీకి నివేదిక అందజేసి శాఖ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించి ఆర్సీలు అందజేస్తాం.– కంచి వేణు, ఎంవీఐ, వరంగల్ అర్బన్ -
మళ్లీ మొదటికి..!
సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖలో స్మార్ట్కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏడాది కాలంగా కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అప్పటికప్పుడు ఏవో కొన్ని కార్డులను దిగుమతి చేసుకొని డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ రెండు, మూడు నెలల్లోనే కొరత సమస్య తిరిగి తలెత్తుత్తోంది. స్మార్టు కార్డులను..వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకుకోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండడం వల్లనే తరచుగా ఈ సమస్య తలెత్తుతోంది. పౌరసేవల పేరిట వినియోగదారుల నుంచి ఏటా రూ.కోట్లల్లో వసూలు చేస్తున్నప్పటికీ స్మార్ట్కార్డుల తయారీకయ్యే ఖర్చులను సకాలంలో చెల్లించడంలో మాత్రం రవాణాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రకాల ఫీజులు, స్పీడ్ పోస్టు చార్జీలు కూడా చెల్లించిన వినియోగదారులు తాము కోరుకొనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులను మాత్రం పొందలేకపోతున్నారు. గత 2 నెలలుగా సుమారు లక్షకు పైగా స్మార్ట్కార్డులు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. ఒకవైపు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వాహనదారులు ఎంతో బాధ్యతగా అన్ని రకాల ఫీజులు చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలాగే డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతున్నారు. నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను, ఆర్సీ పత్రాలను రెన్యూవల్ చేసుకుంటున్నారు. కానీ రవాణాశాఖ మాత్రం పౌరసేవల్లో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. లక్షకు పైగా పెండింగ్... గ్రేటర్ హైదరాబాద్లోని ఉప్పల్, నాగోల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, కొండాపూర్, సికింద్రాబాద్, మలక్పేట్, బండ్లగూడ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో గత 2 నెలలుగా స్మార్ట్కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 250 నుంచి 300 వరకు స్మార్ట్కార్డుల డిమాండ్ ఉంటుంది. ఖైరతాబాద్లోని సెంట్రల్ కార్యాలయంలో మరో వారం రోజులకు సరిపడా కార్డులు మాత్రమే ఉన్నాయి. మేడ్చల్లో ఆర్సీ కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ఉప్పల్లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. ప్రతి రోజు సుమారు 300 మందికి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్ కార్డులను వినియోగదారులకు పంపించే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో కొరత తీవ్రంగా ఉండడంతో ఇటీవల ఖైరతాబాద్ నుంచి 5 వేల కార్డులను తెప్పించి అందజేశారు. ఇప్పటికే 2 నెలలుగా సుమారు లక్షలకు పైగా కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా స్మార్ట్ కార్డులు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. ఒకవేళ ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినా ఇప్పుడు ఆర్టీఏ పౌరసేవల కోసం దరఖాస్తు చేసుకొనేవారు వాటిని స్మార్ట్ కార్డుల రూపంలో పొందేందుకు మరో 2నెలలు ఆగాల్సిందే. చెల్లించిన ఫీజులు ఏమైనట్లు.... డ్రైవింగ్ లైసెన్సు అయినా, ఆర్సీ అయినా స్మార్ట్కార్డు రూపంలో ఉంటేనే వాహనదారుడికి గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం రవాణాశాఖ విధించే నిబంధనలన్నింటినీ పాటిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం రూ.1550 ఆన్లైన్లో ముందే చెల్లించవలసి ఉంటుంది. ఇక వాహనాలు కొనుగోలు చేసిన సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, వాటి శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్తో సహా అన్ని ఫీజులను షోరూమ్లో చెల్లిస్తారు. స్మార్ట్కార్డులను వినియోగదారుల ఇంటికి పంపించేందుకు అయ్యే స్పీడ్ పోస్టు చార్జీ రూ.35 లు కూడా ఆర్టీఏ ఖాతాలో ముందుగానే జమ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు సేవా రుసుము పేరిట రూ.250 వసూలు చేస్తారు.ఇలా ఫీజుల రూపంలోనే రవాణాశాఖ వినియోగదారుల నుంచి ప్రతి సంవత్సరం రూ.వందల కోట్లు వసూలు చేస్తుంది. బకాయిల చెల్లింపుల్లోనే జాప్యం.... గతంలో పూనేకు చెందిన కొన్ని ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలు స్మార్టు కార్డులను తయారు చేసి ఇచ్చేవి. కానీ రవాణాశాఖ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు చేతులెత్తేశాయి. ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్కే చెందిన సీఎంఎస్, ఎంటెక్,తదితర సంస్థలతో గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను అందజేయడం ఈ సంస్థల బాధ్యత.ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ బిల్లులను చెల్లించకపోవడంతో ఆ సంస్థలు కార్డుల పంపిణీ నిలిపివేసినట్లు తెలిసింది. సకాలంలో కార్డులు లభించకపోవడం వల్ల తమ వద్ద ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు రశీదులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నారని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నోలైన్.. అన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. వాహన వినియోగదారులు ఆర్టీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందొచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమకు కావాల్సిన పౌరసేవల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. వినియోగదారుల దరఖాస్తులను, డాక్యుమెంట్లను పరిశీలించిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఫీజులు కూడా ఆన్లైన్లో చెల్లించాలి. లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌరసేవలు మినహాయించి సుమారు 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్ సైతం పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ధ్రువీకరణ కోసమే సెల్ఫీ.. సాధారణంగా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో, ఈ–సేవా కేంద్రాల ద్వారా నెట్బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్లో నమోదైన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏకు వెళ్లి పత్రాలను అధికారులకు అందజేయాలి. అక్కడే ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వారం, 10 రోజులకు వినియోగదారుల ఇళ్లకే స్పీడ్ పోస్టు ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. వినియోగదారుల నిర్ధారణ కోసం ఫొటోలు, డిజిటల్ సంతకాలే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సేవల్లో వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నియంత్రించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లను అరికట్టేందుకు కూడా కీలకం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్ ద్వారా అందజేసే సమాచారంలో వినియోగదారులు కోరుకున్న సేవలను ధ్రువీకరిస్తూ ఒక నంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీఏ ఆన్లైన్ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఈ నంబర్ ఆధారంగా వివరాలు పొందొచ్చు. ఏయే సేవలకు ఆన్లైన్.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్ లైసెన్స్లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహన రిజిస్ట్రేషన్ డూప్లికేట్ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యువల్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిసిన నిరభ్యంతర పత్రాలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు వంటి వాటికి మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. -
గడువు దాటిన ఎల్ఎల్ఆర్లు ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కనీసం నెల రోజులు ఎదురు చూడాల్సిందే! కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు అనుమతినిచ్చే ఎల్ఎల్ఆర్ కోసం నగరంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ నిబంధనలదృష్ట్యా పౌరసేవలపై రవాణాశాఖ ఆన్లైన్ స్లాట్లను గణనీయంగా తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులు తమకు కావాల్సిన సేవలను పొందేందుకు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో ఒకట్రెండు రోజుల్లోనే స్లాట్లు లభించేవి. డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసేవలను వినియోగించుకున్నారు. కానీ కోవిడ్ కట్టడికి విధించిన పరిమితుల దృష్ట్యా పడిగాపులు కాయాల్సి వస్తోంది. లెర్నింగ్ లైసెన్సు పొందిన వినియోగదారులు 6 నెలల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. స్లాట్ల కొరత కారణంగా ఎంతోమంది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సులు పొడిగించుకోవడం కూడా సాధ్యం కాకపోవడంతో పలువురు తమకు ఉన్న అర్హతను కోల్పోవాల్సివస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, గడువు ముగిసిన పర్మనెంట్ లైసెన్సుల రెన్యూవల్ కోసం కూడా ఆన్లైన్లో భారీ ఎత్తున క్యూలో ఉండాల్సి వస్తోంది. ఆర్టీఏ కార్యకలాపాలు మొదలైనప్పటికీ స్లాట్లు పెంచకపోవడం వల్లే డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భారీగా స్లాట్ల కుదింపు.. ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో సాధారణంగా రోజుకు 300 ఎల్ఎల్ఆర్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సైతం ఇంచుమించు అదేస్థాయిలో ఉంటారు. 150 నుంచి 180 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల కోసంస్లాట్లు ఉంటాయి. కానీ.. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారీగా తగ్గించారు. ఎల్ఎల్ఆర్ స్లాట్లు కేవలం 25 నుంచి 30కే పరిమితం చేశారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో లెర్నింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. ఒక్క ఖైరతాబాద్లోనే కాకుండా ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మేడ్చల్.. ఇలా అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్లాట్ల కుదింపుతో లెర్నింగ్ లైసెన్సుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్యలో రోజు రోజుకూ పెరుగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ కూడా 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో సాధారణంగా రోజుకు 350 నుంచి 400 మందికి పరీక్షలు నిర్వహించి లైసెన్సులకు అర్హతను ధ్రువీకరిస్తారు. కానీ.. ఇప్పుడు అక్కడ సైతం 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్తో పాటు కొండాపూర్ తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గడువు దాటిన ఎల్ఎల్ఆర్లు ఎలా? లెర్నింగ్ లైసెన్సులకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఉదాహరణకు గతేడాది నవంబర్లో లెర్నింగ్ లైసెన్సు తీసుకున్నవారు ఈ ఏడాది ఏప్రిల్లో పర్మనెంట్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావాలి. గత డిసెంబర్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నవారు మే నెలలో శాశ్వత లైసెన్స్ పరీక్షలకు హాజరు కావాలి. స్లాట్లు లభించకపోవడంతో వందలాది మంది తమ లెర్నింగ్ లైసెన్సు అర్హతను కూడా కోల్పోవాల్సివస్తోంది. మరోవైపు కాలపరిమితి దాటిన లెర్నింగ్ లైసెన్సుల గడువు పొడిగించాలన్నా స్లాట్లు లభించకపోవడం సమస్యగానే పరిణమించింది. -
ఆర్టీఏ తొలిరోజు ఆదాయం రూ.1.82 కోట్లు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ తర్వాత సేవలు ప్రారంభించిన రవాణా శాఖకు తొలిరోజు రూ. 1.82 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం నుంచి పూర్తి స్థాయిలో రవాణా శాఖ సేవలు మొదలయ్యాయి. రవాణా శాఖ కమిషన ర్ ఎంఆర్ఎంరావు.. గురువారం ప్రధాన కార్యాలయంలో సేవలను దగ్గరుండి ప ర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల్లోని అధికారులతో సమీక్షించారు. రవాణా కార్యాలయాల కు వచ్చే వారు కచ్చితంగా మాస్కులు ధరించటంతోపాటు, భౌతికదూరాన్ని పాటించేలా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు వచ్చే వారు కచ్చితంగా శా నిటైజర్ వినియోగించాలని, వాటిని అందుబా టులో ఉంచాలని ఆయన ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే వారిని కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతించాలన్నారు. -
మాస్క్ ఉంటేనే వాహనాల రిజిస్ట్రేషన్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజులుగా నిలిచిపోయిన ఆర్టీఏ కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వివిధ రకాల పౌరసేవల కోసం అధికారులు బుధవారం రవాణా శాఖ వెబ్సైట్లో స్లాట్లను అందుబాటులోకి తెచ్చారు. గురువారం నుంచి స్లాట్లు పరిమిత స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, డూప్లికేట్ డాక్యుమెంట్లు తదితర సేవల కోసం వినియోగదారులు ఆన్లైన్లో స్లాట్లను నమోదు చేసుకొని ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. లాక్డౌన్కు ముందు (మార్చి 23)స్లాట్లను నమోదు చేసుకుని ఫీజులు చెల్లించినవారికి రానున్న వారం రోజుల్లో దశలవారీగా సేవలను అందజేయనున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్ (విజిలెన్స్)కె.పాపారావు తెలిపారు. లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి ముగిసి లాక్డౌన్ కారణంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి కూడా లెర్నింగ్ లైసెన్సుల గడువును పొడిగించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్– 19 పరిస్థితుల దృష్ట్యా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రతి వినియోగదారుడూ కచ్చితమైన భౌతిక దూరం పాటించాలని సూచించారు. దరఖాస్తుదారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలకు రావాలని చెప్పారు. ఇతరులకు ఎలాంటి అనుమతులు ఉండబోవన్నారు. మాస్క్ఉంటేనే.. ♦ ప్రతి వాహన వినియోగదారుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా వస్తే వాహనాల రిజిస్ట్రేషన్లు సహా ఎలాంటి సేవలనైనా నిలిపివేస్తారు. ♦ కార్యాలయంలోకి వచ్చిన ప్రతి వ్యక్తికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తారు. వ్యక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటించేందుకు అన్ని చోట్లా మార్కింగ్ చేస్తారు. అందుబాటులో శానిటైజర్లను కూడా ఉంచుతారు. ♦ వాహనదారులకు నిర్దేశించిన స్లాట్ ప్రకారమే రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయిస్తే ఆ సమయానికే రావాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యంగా వచ్చినా స్లాట్ రద్దు చేస్తారు. నిర్దేశించిన సమయానికి ముందే వచ్చినా ఇబ్బందే. ♦ సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ ఉంటే చాలామంది ఉదయం 10 గంటలకే ఆఫీస్లకు వస్తారు. ఇక నుంచి అలా రావడానికి వీల్లేదు. నిర్ణీత సమయానికే రావాలి. ముందుగా వచ్చేవారిని లోనికి అనుమతించబోరు. ♦ దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే రావాలి, ఇతరులకు ప్రవేశం ఉండదు. దివ్యాంగులు, సీనియర్ సిటీజన్లు మాత్రం సహాయకులను వెంట తెచ్చుకోవచ్చు. 50 శాతం స్లాట్లు మాత్రమే... ♦ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు స్లాట్ల సంఖ్యను సైతం కుదించారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో సాధారణ రోజుల్లో ఉండే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 50శాతం స్లాట్లను మాత్రమే అనుమతిస్తారు. దీంతో ఎక్కువ మంది గుమిగూడకుండా నియంత్రించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.350 కోట్ల నష్టం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా రవాణాశాఖ సుమారు రూ.350 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. ఫీజులు, వివిధ రకాల పన్నులు, సేవలపై ఈ ఆదాయం లభిస్తుంది.రవాణా వాహనాలపై జూన్లో త్రైమాసిక పన్ను చెల్లించాలి. బీఎస్– 4 వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా స్లాట్లు నమోదు చేసి సేవలు అందజేస్తాం. – కె.పాపారావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్) -
నకిలీల గోల
రవాణాశాఖలో నకిలీ ఇన్సూరెన్స్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నకిలీ బీమా పత్రాల వ్యవహారంలో ఆ శాఖ అధికారులు, ప్రైవేట్ ఏజెంట్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే విషయం కొంతమంది బీమా, రవాణా ఏజెంట్లకు కలసివస్తోంది. ఫిట్నెస్, ట్రాన్స్ఫర్ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులతో అనధికార ఒప్పందం చేసుకుని నకిలీ పత్రాలతో జేబులు నింపుకుంటున్న పరిస్థితి ఉంది. రవాణాశాఖలో నకిలీల వ్యవహారం గత ఎస్పీ దృష్టికి వెళ్లింది. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. దీంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సొంతంగా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ ట్రాక్టర్కు నకిలీ బీమా పత్రం ఉంది. ఈ రీతిలో నకిలీ పత్రాలతో ప్రయానించే సమయంలో ప్రమాదం జరిగితే వాహనాల యజమానులతోపాటు గాయపడిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కో ధర.. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చేందుకు కొంతమంది బీమా, రవాణా శాఖ ఏజెంట్లు ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు రవాణా కార్యాలయం సమీపంలో ఓ మహిళా ఏజెంట్ కూడా నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. బీమా సంస్థకు ఇన్సూరెన్స్ చెల్లించాలంటే ఎక్కువ ధర ఉండడంతో ఎక్కువ మంది వాహనదారులు నకిలీ పత్రాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ఆటో, బైక్, ఎల్జీవీ, ట్రాక్టర్ యజమానులు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తీసుకుంటున్నట్లు సమాచారం. బైక్కు రూ.200 నుంచి రూ.300, ఆటోకు రూ.1500, లైట్ గూడ్స్ వెహికల్కు రూ.4,000, ట్రాక్టర్కు రూ.500 నుంచి రూ.1,000లు తీసుకుని నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇస్తున్నారు. ప్రధానంగా హెచ్బీఎఫ్సీ, ఫ్యూచర్ జనరల్, జీఓ డిజిట్, ఇస్కోటోక్యో, శ్రీరామ్ తదితర కంపెనీల మీద కొంతమంది ఏజెంట్లు నకిలీ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల జారీలో ఆటో ఫైనాన్స్ కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నెల్లూరు(టౌన్): ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంది. ఇన్సూరెన్స్ చెల్లిస్తేనే ఆ వాహనంపై లావాదేవీలను జరుపుతారు. వాహనాలకు ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చేందుకు పదుల సంఖ్యలో బీమా సంస్థలు ఉన్నాయి. ఏడాదికి ద్విచక్ర వాహనానికి రూ.1,400, ఆటోకు రూ.7,851లు, లైట్ గూడ్స్ వెహికల్కు రూ.18,600, ట్రాక్టర్కు రూ.14,500, లారీకి రూ. 35,000 ఇన్సూరెన్స్చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు పలు ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం, వాహన యజమానికి, బయట వ్యక్తులు గాయపడిన సమయంలో సంస్థ నిబంధనలు ప్రకారం బీమాను వర్తింపజేస్తారు. కలసివస్తున్న ఆన్లైన్ విధానం రెండేళ్ల క్రితం రవాణాశాఖలో 80కు పైగా సేవలను ఆన్లైన్ చేశారు. దీంతో మీసేవ, ఏపీఆన్లైన్, కామన్ సర్వీస్ సెంటర్ తదితర వాటిల్లో ఆన్లైన్ సేవలు నిర్వహిస్తున్నారు. అయితే వాహన లావాదేవీలకు సంబంధించి పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఫిట్నెస్, వాహన ట్రాన్స్ఫర్ల సమయంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఆన్లైన్ విధానం కావడంతో ఒరిజనల్ పత్రాలను చూసే పరిస్థితి రవాణా అధికారులకు ఉండదు. అనుమానం వస్తే తప్పనిసరిగా విచారణ చేయాలి. అదేం లేకుండా నకిలీ పత్రాన్ని ఓకే చేసినందుకు సంబంధిత గుమస్తా, ఏఓ, ఆర్టీఓకు రూ.300 నుంచి రూ.700 వరకు ముట్టజెప్పాల్సి ఉంటుందని సమాచారం. ప్రమాదం జరిగితే అంతే.. నకిలీ ఇన్సూరెన్స్లు ఉన్న వాహనాలు ప్రమాదాలకు గురైతే ఒక్కపైసా కూడా రాదు. పైగా ప్రమాదంలో వాహన యజమాని, లేదా బయట వ్యక్తి గాయపడినా, మృతి చెందినా బీమా సంస్థ నుంచి రూపాయి కూడా అందదు. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నకిలీ ఇన్సూరెన్స్ పత్రం కావడంతో మరణించిన వ్యక్తికి రూ.7 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న ట్రాక్టర్ను యజమానే సొంత డబ్బులతో రిపేరు చేయించుకున్నారు. అదే ఒరిజనల్ ఇన్సూరెన్స్ పత్రం కలిగి ఉంటే వాహనంతో పాటు మరణించిన వ్యక్తికి సంస్థ నుంచి నగదు వచ్చేది. ఇప్పటికీ నకిలీ బీమా పత్రాలు కలిగి ప్రమాదాలు జరిగి పలు వాహనాల మీద కేసులు నడుస్తున్నాయి. నకిలీ బీమా పత్రాల మీద గత ఎస్పీకి కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. ఇప్పటికైనా నకిలీ బీమా పత్రాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీప్రతినిధులతో సమావేశం నకిలీ ఇన్సూరెన్స్లకు సంబంధించి ఆయా బీమా కంపెనీ ప్రతినిధులతో వచ్చేవారం సమావేశం నిర్వహిస్తాం. ఇన్సూరెన్స్ పత్రానికి సంబంధించి క్యూ ఆర్ను పరిశీలిస్తున్నాం. ఇప్పటి నుంచి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. పట్టుబడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.–సుబ్బారావు, రవాణా శాఖఉప కమిషనర్ -
ఆన్లైన్ రూట్లో ఆర్టీఏ
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ ఆన్లైన్ బాటపడుతోంది. ప్రత్యేక నంబర్ల కోసం ఆన్లైన్ బిడ్డింగ్ విజయవంతంగా నిర్వహించిన ఆర్టీఏ.. మరిన్ని సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాహన వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావలసిన అవసరంలేని సేవల్ని గుర్తించి ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. ఇంటి వద్ద నుంచే నేరుగా ఈ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు ఆన్లైన్లో స్లాట్ నమోదుకే అవకాశం ఉంది. ఒకసారి స్లాట్ (సమయం,తేదీ) నమోదు చేసుకున్న వినియోగదారులు నెట్బ్యాంకింగ్ లేదా ఈ సేవ కేంద్రా ల్లో ఫీజు చెల్లించి నిర్ణీత సమయం ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి ఉండేది. ఇకపై కొన్ని సేవలకు మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టే సుమారు 20 రకాల పౌరసేవలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వినియోగదారుల అభ్యర్థనలు, వారు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు, చిరునామా ధ్రువీకరణ ఇతర పత్రాలను అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే.. వారు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. ఇందుకోసం నెట్బ్యాంకింగ్, ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తున్నట్టే ఫీజులను చెల్లించాలి. రవాణాశాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిన వెంటనే మార్చి నుంచి ఆన్లైన్ సేవలను అమల్లోకి తేనున్నట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఆన్లైన్ సేవలివే.. లెర్నింగ్ లైసెన్స్ కేటగిరీ: కాలపరిమితి ముగిసిన లెర్నింగ్ లైసెన్స్ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు ద్విచక్ర వాహనం నడిపేందుకు మొదట అనుమతి పొందిన వారు తరువాత ఆన్లైన్లోనే కారు లేదా ఆటో వంటి వాటి కోసం అనుమతి పొందవచ్చు. లెర్నింగ్ లైసెన్స్ పోగొట్టుకొంటే తిరిగి డూప్లికేట్ పొందవచ్చు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ స్థానంలో లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ: రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, లైసెన్స్లో చిరునామా మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను పొందవచ్చు. కండక్టర్ లైసెన్స్: ఆర్టీసీ కండక్టర్లు, ఇతర ప్రయాణికుల వాహనాల్లో కండక్టర్లుగా విధులు నిర్వహించే వారు ఆర్టీఏ నుంచి పొందే లైసెన్స్ ఆన్లైన్లోనే లభిస్తుంది. కొత్త లైసెన్స్ తీసుకోవడంతో పాటు రెన్యూవల్, డూప్లికేట్, అడ్రస్ మార్పువంటి అన్ని సదుపాయాలను పొందవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్ కేటగిరీ: వాహనం యాజమాన్య బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారు తమ పూర్తి వివరాలను, డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డూప్లికేట్ ఆర్సీ తీసుకోవచ్చు. సదరు వాహనానికి ఫైనాన్స్ ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఆర్సీ (వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)లో చిరునామా మార్చుకోవచ్చు. వాహనంఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవచ్చు. డాక్యుమెంట్లే కీలకం ఆన్లైన్ సేవల్లో వినియోగదారులు సమర్పించే డాక్యుమెంట్లను అధికారులు సీరియస్గా పరిగణిస్తారు. ఉదాహరణకు వాహన యాజమాన్యం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేందుకు ప్రస్తుతం అందజేసే పత్రాలనే ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు వాహనం ఫొటో, అభ్యర్థుల తాజా చిత్రాలను సైతం అందజేయాలి. అభ్యర్థుల సంతకాలనూ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ‘ఫొటోలకు సంబంధించి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల సెల్ఫీ అప్లోడ్ చేయడమా లేక, ఇంకేదైనా చేయవచ్చా అనేది పరిశీలిస్తున్నాం’అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. -
ఆర్టీఏ ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ప్రత్యేక రిజర్వేషన్ నెంబర్లకు ఇక ఆన్లైన్లోనే టెండర్లు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ సోమవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని ఐదు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఒక నెల తరువాత రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏలకు దీనిని విస్తరిస్తారు. రిజర్వేషన్ నెంబర్లపై ప్రస్తుతం నిర్వహిస్తున్న టెండర్ ప్రక్రియ వల్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ బిడ్డింగ్కు చర్యలు చేపట్టింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆన్లైన్ బిడ్డింగ్ విధివిధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రవాణాశాఖ తాజాగా ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కొత్త విధానం మేరకు వినియోగదారులు తమకు కావలసిన నెంబర్లను ఆర్టీఏ వెబ్సైట్లోనే ఎంపిక చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఫీజు చెల్లించి, వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆధార్, పాన్కార్డు తదితర డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒక నెంబర్పైన ఎంత మందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్బ్యాంకింగ్ లేదా ఇతర ఆన్లైన్ పద్ధతుల్లోనే ఆర్టీఏ నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ బిడ్డింగ్ను ఆహ్వానిస్తారు. డిమాండ్ బాగా ఉన్న నెంబర్పైన వినియోగదారులు ఎంత మందైనా పోటీ పడవచ్చు. చివరకు ఎక్కువ మొత్తంలో బిడ్డింగ్ చేసిన వారికి నెంబర్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరిగిపోతుంది. బిడ్డింగ్లో నంబర్లను దక్కించుకోలేని వారికి వారు చెల్లించిన డబ్బులు ఆ తరువాత 48 గంటల్లో తిరిగి వాళ్ల ఖాతాలో జమ అవుతాయి. పోటీలో పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందచేస్తారు. అనూహ్యమైన డిమాండ్... ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారుల్లో అనూహ్యమైన డిమాండ్ ఉంది. ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో “9999’ నెంబర్కు వాహనదారులు రూ.10 లక్షల వరకు కూడా చెల్లించేందుకు పోటీపడుతున్నారు. ఖరీదైన హైఎండ్ కార్లను, బైక్లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు నచ్చిన నెంబర్ల కోసం ఎన్ని రు.లక్షలైనా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో రవాణాశాఖకు ప్రత్యేక నెంబర్లపైన ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. ‘0009, 999, 9999, 1234, 6666, 2233, 7777,1111’ వంటి నెంబర్లకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని రకాల నెంబర్లను అదృష్ట సంఖ్యలుగా భావిస్తుండగా, మరికొన్ని రైజింగ్ నెంబర్లుగా, ఫ్యాన్సీ నెంబర్లుగా వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రత్యేక నెంబర్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని దళారులు రంగంలోకి దిగారు. వాహనదారులకు కావలసిన నెంబర్ల కోసం ఒక బేరం కుదుర్చుకొని ఆ తరువాత ఆర్టీఏ అధికారుల సహకారంతో సదరు నెంబర్లకు పోటీ లేకుండా దక్కించుకోవడం లేదా, ఆ నెంబర్లకు ఆ రోజు యాక్షన్ నుంచి మినహాయింపును ఇచ్చేసి మరుసటి రోజు లెఫ్టో్టవర్ (మిగిలిపోయిన) నెంబర్లుగా ఎలాంటి బిడ్డింగ్ లేకుండా రూ.లక్షల్లో సొమ్ము చేసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో ఏజెంట్లు సిండికేట్గా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ బిడ్డింగ్కు శ్రీకారం చుట్టారు. 5 కేంద్రాల్లో అమలు ఇలా... నగరంలోని ఖైరతాబాద్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మలక్పేట్, బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఐదు ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో వాహనదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించి, బిడ్డింగ్లో పాల్గొనవలసి ఉంటుంది. ఒక నెంబర్ కోసం ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉండి, ఎక్కువ మొత్తంలో చెల్లించిన వారికి నెంబర్ను కేటాయిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక్కరే దరఖాస్తు చేసుకొంటే అలాంటి నెంబర్లు పోటీ లేకుండానే లభిస్తాయి. కాగా ఆన్లైన్ బిడ్డర్లు ఎవైనా సందేహాలుంటే నివృత్తి కోసం 040–23370081/83/84 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
వారెవ్వా ‘వాలెట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఎం–వాలెట్. ఇప్పుడు మరోసారి వాహనదారులంతా దీనిపైనే దృష్టిసారించారు. వివిధ రకాల ధృవపత్రాలను మొబైల్ ఫోన్లోనే భద్రపరుచుకొనే అద్భుతమైన సదుపాయం, డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేకపోవడం, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే వీలుండడంతో వాహనదారులు ఈ యాప్ను ఇష్టపడుతున్నారు. ఈ యాప్ ఉంటే అన్నిరకాల డాక్యుమెంట్లు జేబులో ఉన్నట్లే లెక్క. డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వంటి వివిధ రకాల సర్టిఫికెట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొనేవిధంగా రవాణాశాఖ ఎం–వాలెట్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. డాక్యుమెంట్లను ఎం–వాలెట్లో భద్రపరుచుకున్నారు. ఈ వాలెట్కు రవాణాశాఖ చట్టబద్ధత కల్పించడంతో అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. ఇటీవల కేంద్రంకూడా ఈ వాలెట్ను గుర్తించింది. దీంతో దేశంలో ఎక్కడైనా ఎం–వాలెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ తాజాగా మరోసారి వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా సవరించిన రోడ్డు భద్రతా చట్టం దృష్ట్యా మరో సారి ఎం–వాలెట్కు డిమాండ్ ఏర్పడింది. ఒక్క వాలెట్ చాలు... రోడ్డు భద్రత నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంతో వాహనదారులంతా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ ఈ చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల ఉల్లంఘనలపై రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేంద్రం విధించిన జరిమానాలను తగ్గించి అమలు చేసే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త చట్టంకొరడా ఝళిపించే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం జరిమానాలను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న పెనాల్టీల కంటే పెద్ద మొత్తంలోనే భారం పెరగనుంది. దీంతో వాహనదారులు ఇప్పటి నుంచే కొత్త చట్టానికి అనుగుణంగా నిబంధనలను పాటిస్తున్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ వంటి వివిధ రకాల డాక్యుమెంట్లపైన కూడా శ్రద్ధ చూపుతున్నారు. దీంతో మూడేళ్ల క్రితమే రవాణాశాఖ అమల్లోకి తెచ్చిన ఎం–వాలెట్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా మారింది. అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పత్రాల రూపంలో ఈ వాలెట్ ద్వారా భద్రపరుచుకుంటున్నారు. గత వారం రోజుల్లో సుమారు 15 వేల మందికి పైగా వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. 33 లక్షలకు పైగా వాహనదారులు మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎం–వాలెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 33.31 లక్షలకు పెరిగింది. ఈ వాహనదారులు 68.81 లక్షల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కువ శాతం డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలు, ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఆ తరువాత పర్మిట్లు, ఫిట్నెస్ పత్రాలను ఎక్కువ మంది తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్ యాప్ ద్వారా భద్రపరుచుకున్నారు. త్వరలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లను కూడా ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. మరోవైపు తమ వాహనాలపైన నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలను సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో చెల్లించే సదుపాయం ఉంది. తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడైనా సరే ఎం–వాలెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో ఈ వాలెట్ వినియోగం బాగా పెరిగింది. ఆన్లైన్ సేవల వినియోగంలో రవాణాశాఖ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రవాణాశాఖలో ఇటీవల కాలంలో స్మార్ట్కార్డులకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది, స్టేషనరీ మెటీరియల్ లేకపోవడంతో లక్షలాది స్మార్ట్ కార్డుల ముద్రణ నిలిచిపోయింది. దీంతో ఎం–వాలెట్ వినియోగం మరింత పెరిగిపోయింది. -
దళారులకు కేరాఫ్ రవాణాశాఖ !
సాక్షి, కరీంనగర్ : అవినీతి, అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్ రహదారి వంటి స్టేట్హైవేతోపాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 70వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్విభజన తరువాత పాత కరీంనగర్ నాలుగు కొత్త్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు. అయినా.. రిజిస్టేషన్ల సంఖ్యతోపాటు ఆదాయంలో కూడా కరీంనగర్ జిల్లానే టాప్గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి(డీటీసీ)ని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా ఇన్చార్జిల పాలనే సాగుతుండడంతో అధికారులు, సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు డీటీసీని నియమించి కరీంనగర్కు ఆయనను ఇన్చార్జిగా నియమించడం. జిల్లాలో ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్పాషా ఇటీవలే అవినీతి ఆరోపణలపై కమిషనర్ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూళ్లు చేసిన సదరు అధికారి తాజాగా ‘గూగుల్ పే’ వంటి అధునాతన ఆన్లైన్ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ ఎంవీఐ ఒక్కరే మిగిలారు. సిబ్బంది పాత్ర షరా మామూలే. ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి. ఇన్చార్జి అధికారులే ఇక్కడ..! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గానీ, విభజన తరువాత కరీంనగర్లో గానీ రెగ్యులర్ ఆర్టీవో/డీటీసీలు లేరు. 2012 నుంచి 2014 వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పనిచేశారు. కరీంనగర్కు ఈమెనే రెగ్యులర్ ఆర్టీవోగా పనిచేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చినవారంతా ఇన్చార్జీలే. 2014–17 వరకు వినోద్కుమార్ ఇన్చార్జి డీటీసీగా కొనసాగారు. ఆయన తరువాత 2017 నుంచి 2018 వరకు కొండల్రావు, 2018 నుంచి 2019 వరకు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్ ఇన్చార్జి అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరు రెగ్యులర్ ఏఎంవీఐలు ఉండగా, ఇటీవల ఏఎంవీఐ గౌస్పాషా గూగుల్ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణాశాఖ కమిషనర్కే సరెండర్ చేశారు. ప్రస్తుతం రజినీదేవి ఒక్కరే ఇక్కడ రెగ్యులర్ అధికారి. గౌస్పాషా సరెండర్ తర్వాత పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్ను తాత్కాలికంగా కరీంనగర్కు ఏఎంవీఐగా నియమించారు. లంచాల కోసం పీడింపు.. కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లర్నింగ్ లైసెన్స్ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్ తరువాత రెగ్యులర్ లైసెన్స్, వాహనాల రోడ్ టాక్స్, ఫిట్నెస్ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్ లైసెన్స్కు రూ.6 వేలు, రిజిస్టేషన్కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్ వీలర్స్కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనని ఇటీవల ఎంవీఐ సరెండర్తో జిల్లా వాసులకు తెలిసిపోయింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్ లోడింగ్ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది. అంతా ఏజెంట్లదే.. రవాణాశాఖ కార్యాలయంలో సుమారు 15 మంది ఏజెంట్లు రాజ్యమేలుతన్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్ గానీ, వాహనం రిజిస్ట్రేషన్ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది. అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి. పంపకాల్లో అటెండర్ నుంచి అధికారి వరకు... ఏజెంట్ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్ నుంచి కార్యాలయంలోని అసలు బాస్ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్పై కోడ్భాషలో ఇచ్చే ఇండికేషన్ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కా దని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. జిరాక్స్ సెంటర్లే అడ్డా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అడ్డాగా చేసుకుని ఏజెంట్లు దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల సిబ్బంది కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై బే రం మాట్లాడుతున్నారు. వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంట్కు సమాచారం అందించడంతోపాటు స్లాట్బుక్ చేయడం.. నుంచి సర్టిఫికెట్ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం. -
ఆర్టీఏ..ఈజీయే!
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అందించే వివిధ రకాల పౌరసేవల్లో పెనుమార్పులు రానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. దాదాపు 37 రకాల సేవలను మనం ఎంచక్కా ఇంట్లో కూర్చుని.. ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. అనుమతి వస్తే.. వెంటనే అమలే.. ఇంతకీ ఏంటా మార్పు.. వివరాలు ఇవిగో.. ఇప్పటివరకు.. అన్ని రకాల పౌర సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ (సమయం, తేదీ) నమోదు చేసుకొని.. ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించిన తరువాత నిర్దేశిత సమయం మేరకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వస్తుంది. సంబంధిత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పత్రాల కోసం అటూ ఇటూ తిరగడాలు.. మధ్యవర్తులు, దళారుల హడావుడి.. చేతికి చమురు వదలడాలు ఇవన్నీ మామూలే.. ఇకపై.. ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. దళారుల బెడద ఉండదు. పాత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, అలాగే అవసరమైన అన్ని రకాల పౌరసేవల్లో.. చిరునామాలో మార్పులు, చేర్పులు.. వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను ఆన్లైన్లోనే పునరుద్ధరించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే వాహనాలకు నిరభ్యంతర పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ఒకరి నుంచి మరొకరికి వాహన యాజమాన్యం బదిలీ, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు, లెర్నింగ్ లైసెన్స్ గడువు పొడిగింపు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ ఆర్సీ, త్రైమాసిక పన్ను, గ్రీన్ ట్యాక్స్ వంటి వివిధ రకాల పన్ను చెల్లింపులు, హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్ వంటి సుమారు 37 రకాల పౌరసేవలను ఆన్లైన్లో పొందవచ్చు. ప్రస్తుతం వీటి కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి వస్తుంది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, నెట్బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.ఆర్టీఏ అధికారులు తమకు అందిన దరఖాస్తులు, డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం వినియోగదారులు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సదుపాయం లభిస్తుంది.దీంతో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే సేవలు లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులపై కూడా పనిభారం తగ్గుతుందని చెబుతున్నారు. ఇవి మాత్రం ఎప్పటిలాగే.. ఆర్టీఏ అధికారులు స్వయంగా పరీక్షించి అందజేసే లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.లెర్నింగ్ లైసెన్సు కోసం ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని ఫీజు చెల్లించి వెళితే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఇది తీసుకున్న తరువాత నెల నుంచి 6 నెలలోపు మరోసారి డ్రైవింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలి. లారీలు, బస్సులు, ఆటోలు తదితర ప్రయాణికుల, సరుకుల రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి అందజేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. -
ఆర్టీఏ.. అదంతే!
‘హలో సార్.. నాలుగు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించిన పరీక్షలో పాస్ అయ్యాను. వారం రోజుల్లో లైసెన్స్ నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాలేదు’ ఇదో వాహనదారుడి ఆందోళన. ‘కొత్త బండి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరు నెలలైంది.ఇంకా ఆర్సీ రాలేదు. ట్రాఫిక్ పోలీసులుఇబ్బందులకుగురిచేస్తున్నారు’ మరో వాహనదారుడి ఆవేదన. ‘వాహనం అడ్రస్ మార్పు కోసం అధికారులనుసంప్రదిస్తే సరైన స్పందన లేదు. పట్టించుకునేవాళ్లే లేరంటూ’ నగర శివార్లలోని ఒక ఆర్టీఏకార్యాలయంలో ఎదురైన పరిస్థితిపైఓ మహిళ విస్మయం. సాక్షి, సిటీబ్యూరో: ఇలా ఒక్కరో, ఇద్దరో కాదు. లక్షలాది మంది వాహనదారులు ఆర్టీఏ పౌరసేవల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి, నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లను అందజేసినప్పటికీ డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు తదితర పౌరసేవలు లభించక నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2.15 లక్షల ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా పెం డింగ్ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఒకట్రెండు ఆర్టీఏ కార్యాలయాల్లో సత్వరమే పరిష్కారం లభిస్తున్నప్పటికీ చాలాచోట్ల అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఆర్టీఏ పౌరసేవలపైన నిర్దిష్టమైన కాలపరిమితిని విధించారు. అంతర్రాష్ట్ర బదిలీలపైన మాత్రమే 30 రోజుల గడువు విధించారు. మిగతా అన్ని రకాల పౌరసేవలు... ముఖ్యం గా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, అడ్రస్ మార్పులు తదితర వారం, పది రోజుల్లో లభించే విధంగా సిటిజన్ చార్టర్ను రూపొందించారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వారంరోజుల కాలపరిమితి 6 నెలల వరకు కొనసాగడం గమనార్హం. ఎందుకిలా.? రవాణాశాఖ పౌరసేవలపై వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పటిష్టమైన ఆన్లైన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఓజీఆర్టీఎస్) ఏర్పాటు చేశారు. వాహన వినియోగదారులు ఆర్టీఏ వెబ్సైట్లోని ‘సిటిజన్ చార్టర్ కంప్లయింట్స్’ను ఎంపిక చేసుకొని తమ ఫిర్యాదును తెలియజేయవచ్చు. అలాగే బీఎస్ఎన్ఎల్ ద్వారా స్వీకరించేందుకు ‘1100’, ఇతర ఫోన్ల నుంచి స్వీకరించేందుకు ‘18004251110’ అనే రెండు టోల్ఫ్రీ నంబర్లను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. జిల్లాల విభజన వరకు ఈ వ్యవస్థలు సక్రమంగానే పని చేశాయి. వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల్లో చాలా వరకు అప్పటికప్పుడు పరిష్కరించడమో లేదా ఎప్పటిలోగా తమ సమస్యను పరిష్కరిస్తారో తెలియజేసేవారు. కానీ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి, పైస్థాయి ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. అన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటికి ప్రాంతీయ రవాణా అధికారులు, యూనిట్ మోటారు వాహన ఇన్స్పెక్టర్ల స్థాయిలో పరిష్కారాన్ని సాధించడంలో ఓజీఆర్ఆటీఎస్ వ్యవస్థ విఫలమైంది. దీంతో ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ జాబితాలో చేరిపోయాయి. మరోవైపు తమకు సకాలంలో సరైన పరిష్కారం లభించకపోవడంతో వినియోగదారులు పదే పదే ఫిర్యాదులు చేయడం కూడా మరో కారణం. ఇదే అసలు సమస్య.. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి నుంచి పైవరకు సమన్వయ లేమితో పాటు ఇటీవల కాలంలో డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు) ముద్రించేందుకు అవసరమైన కార్డులు, రిబ్బన్ల కొరత మరో ప్రధానమైన సమస్యగా మారింది. రవాణాశాఖకు స్టేషనరీ అందజేసే ప్రైవేట్ సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సుమారు రూ.7 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సదరు సంస్థలు కార్డులు, రిబ్బన్ల పంపిణీకి చేతులెత్తేయడంతో వినియోగదారులకు సకాలంలో అందజేయలేకపోయారు. కేవలం వారం రోజుల్లో అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం 4 నెలల నుంచి 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న వినియోగదారులు కూడా ఉన్నారు. మంత్రి సమీక్షతో కదలిక.. ఇటీవల రవాణాశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్డుల పంపిణీ స్తంభించిపోవడం, స్టేషనరీ కొరత, ప్రింటర్లు, స్కానర్లు లేకపోవడం, పనిచేయని కంప్యూటర్లు తదితర అంశాలను పరిశీలించారు. వాహనదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా ఓజీఆర్టీఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. మరోవైపు తేలిగ్గా ఫిర్యాదు చేసేందుకు ఒక వాట్సప్ నంబర్ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ‘కొద్ది రోజుల క్రితమే కొత్త ప్రింటర్లు, స్కానర్లు, స్టేషనరీ వచ్చాయి. త్వరలోనే వాహనదారుల సమస్యలన్నింటినీ పరిష్కస్తాం’ అని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement