Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Huge Land Grabbing Scam In Manikonda Pokalwada
ధరణిలో గోల్‌మాల్‌.. మణికొండలో భారీ భూకబ్జా!

హైదరాబాద్‌, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్‌మాల్‌ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించారు. ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో ధరణిలో పాస్‌బుక్‌లు జారీ చేశారు. ఈ భాగోతం బయటపడడంతో సైబరాబాద్‌ పోలీసులు అరెస్టులకు దిగారు. ధరణి ఉద్యోగులు మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్‌ కోసం రూ.8 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్‌​ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్‌ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్‌ పోలీసులు ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్‌ చేసుకున్న ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Director Ratheesh Balakrishnan Treated Like a Maid: Costume designer Liji Preman
ఆ డైరెక్టర్‌ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..

మలయాళ దర్శకుడు రథీశ్‌ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లిజి ప్రేమన్‌. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్‌: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్‌ దగ్గరి నుంచి షూటింగ్‌ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్‌ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్‌ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్‌ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్‌ అని రాశారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్‌ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్‌ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్‌ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్‌ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!

IndiGo plane landing and an Air India aircraft takeoff from the same runway less than a minute
ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?

విమానం టేకాఫ్‌ అయిన నిమిషంలోపే అదే రన్‌వేపై మరో విమానం ల్యాండ్‌ అయిన ఘటన ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పందించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే రన్‌వేపై రెండు విమానాలు నడపవచ్చని నిబంధనలున్నట్లు కొన్ని సంస్థలు నివేదిస్తున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం. అసలేం జరిగిందంటే..ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్‌ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్‌ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు.ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించింది. డీజీసీఏతోపాటు ఇండిగో, ఎయిరిండియా సంస్థలు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపాయి.ఒకే రన్‌వేలో రెండు విమానాలు నడపవచ్చా?ఏటీసీ నిబంధనల ప్రకారం వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్‌లకు అనుమతించవచ్చు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ప్రత్యేక సందర్భంలో కూడా విజిబిలిటీ బాగానే ఉందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని పీటీఐ నివేదించింది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్‌డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024

New Continent Same Result: Sachin Tendulkar Roasts Pak After Loss Vs India T20 WC
వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

పాకిస్తాన్‌పై అజేయ చరిత్రను కొనసాగిస్తూ టీమిండియా మరోసారి ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్రతద్వారా టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఏడుసార్లు గెలుపొంది ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.ఇక దాయాది పాక్‌పై భారత్‌ విజయంలో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా.. మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.మరోవైపు పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం రెండు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టి పాకిస్తాన్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ విజయం పట్ల టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా రోహిత్‌ సేనపై.. ముఖ్యంగా బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌!‘‘ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌. కొత్త ఖండం.. అయినా అదే ఫలితం. టీ20 ఫార్మాట్‌ అనేది బ్యాటర్ల గేమ్‌.. అయితే, న్యూయార్క్‌లో మాత్రం బౌలర్లు కనువిందు చేశారు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌! అమెరికాలో అద్భుత వాతావరణంలో అత్యద్భుతంగా మన ఆట తీరును చూపించారు. బాగా ఆడారు.. టీమిండియాదే విజయం’’ అని సచిన్‌ టెండుల్కర్‌ ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపాడు.ఈ క్రమంలో సచిన్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు సైతం భారత జట్టును అభినందించారు. ఇదొక ప్రత్యేకమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు.ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌👉వేదిక: నసావూ ఇంటర్నేషనల్‌ స్టేడియం, న్యూయార్క్‌👉టాస్‌: పాకిస్తాన్‌.. తొలుత బౌలింగ్‌👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్‌ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(3/14).చదవండి: Ind vs Pak: బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు View this post on Instagram A post shared by ICC (@icc)

JK Bus Attack: NIA to probe massive hunt for terrorists
జమ్ము కశ్మీర్‌: డ్రోన్‌ల సాయంతో ఎన్‌ఐఏ ‘ఉగ్ర’ వేట

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్​కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్​లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్​ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్​కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్​లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్​లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు.

Seema Haider Pakistani Husband Ghulam Haider to Appear in Court
మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్‌.. భారత్‌ వచ్చిన పాక్‌ భర్త?

పాక్‌ నుంచి పారిపోయివచ్చి, తన ప్రియుడు సచిన్‌తో పాటు యూపీలోని నోయిడాలో ఉంటున్న సీమా హైదర్‌ ఇప్పుడు మరిన్ని చి​క్కుల్లో పడ్డారు. ఆమె పాకిస్తాన్‌ భర్త గులాం హైదర్‌ భారత్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగా ఆయనే స్వయంగా తన యూట్యూబ్‌ చానల్‌లో తెలిపారు. గులాం హైదర్‌ ఆ వీడియోలో..‘పిల్లలూ మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా కోర్టు సీమా హైదర్ పాకిస్తాన్‌ భర్త గులాం హైదర్‌ను జూన్ 10న కోర్టుకు హాజరు కావాలని సమన్లు ​​జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆయన ఈరోజు (సోమవారం) నోయిడా కోర్టుకు హాజరు కావాల్సివుంది. సీమా హైదర్ పాక్‌ నుంచి భారత్‌ వచ్చినది మొదలు ముఖ్యాంశాలలో కనిపిస్తున్నారు. సీమా-సచిన్ ల ప్రేమకథ దేశవ్యాప్తంగా హల్‌చల్‌ చేసింది. సీమా తనతో పాటు తన నలుగురు పిల్లలను కూడా పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ఈ పిల్లలు సీమా, ఆమె పాక్‌ భర్త గులాం హైదర్‌లకు జన్మించారు.తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్‌ పాకిస్తాన్‌ భర్త గులాం హైదర్‌ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో నివసిస్తున్న ఆయన.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటు కాదంటూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని పేర్కొంది.ఈ ఉదంతం గురించి మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉన్నదన్నారు. సీమా ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని అన్నారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్‌కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్‌ తెలిపారు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇ‍వ్వనున్నదో వేచి చూడాల్సిందే.

YSRCP MLA Matsyarasa Visweswara Raju On Party Change Rumour
వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు

అల్లూరి సీతారామరాజు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్‌ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

Chinese Tech Company Offers Weight Loss Incentives
ఇలాంటి బంపర్‌ ఆఫర్‌ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!

ప్రస్తుతం అందర్నీ బాగా వేదించే సమస్య అధిక బరువు. నేటి జీవన విధానం, శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో కంప్యూటర్ల మందు గంటగంటలు కూర్చొని చేసే ఉద్యోగాలతో చిన్న, పెద్దా అంతా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒకవేళ​ వ్యాయామాలు చేద్దామనుకున్నా..కొన్ని రోజులు చేసి బద్ధకంతో స్కిప్‌ చేస్తూ పోతుండటంతో బరువులో పెద్ద మార్పు ఉండదు. దీంతో అధిక బరువు అన్నది భారమైన సమస్యగా మిగిలిపోతోంది చాలామందికి. తాజగా ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ మంచి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తన ఉద్యోగులు ఆరోగ్యకరంగా మంచి సామర్థ్యంతో పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ని పెట్టిందట. ఆ ఆఫర్‌ వింటే ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా?.. అని విస్తుపోతారు. ఎక్కడంటే..చైనాలో షెన్‌జెన్‌లోని ఇన్‌స్టా360 అనే టెక్‌ కంపెనీ తన ఉద్యోగులకు మంచి ఆరోగ్యంతో హాయిగా పనిచేసుకోండి అంటూ ఓ గొప్ప ఆఫర్‌ ఇచ్చింది. అదేంటంటే హాయిగా బరువు తగ్గండి దగ్గర దగ్గర కోటి రూపాయాల వరకు బోనస్‌లు పొందండి అని ఆఫర్‌ ఇచ్చింది. ఈ టెక్‌ కంపెనీ తన ఉద్యోగులు ఊబకాయ సమస్య నుంచి బయటపడేలా బరువు తగ్గించే బ్యూట్‌ క్యాంప్‌ అనే కార్యక్రమాన్ని ప్రారండించింది. ఈ కార్యక్రమంలో మూడు నెలల పాటు సాగుతుంది. ప్రతి సెషన్‌లో సుమారు 30 మంది ఉద్యోగుల వరకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్యక్రమంలో ఊబకాయం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు.ప్రతి సెషన్‌ మూడు గ్రూపులుగా విభజించి, వారంలో సముహం మొత్తం బరువు సగటు ఆధారంగా బోనస్‌లు అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ విజయాన్ని ఆయా సముహాలకే ఇస్తుంది. ఎందుకంటే గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా తగ్గితేనే కదా డబ్బులు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలన్న సంకల్పం వారిలో అనుకోకుండా రావడమే గాక పక్కవారిని మోటీవేట్‌ చేస్తారు. దీంతో సమిష్టిగా బరువు తగ్గే ప్రయత్నం తోపాటు వారి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఆ కంపెనీ 2023లో ప్రారంభించింది. ఆ కంపెనీ అనుకున్నట్లు తమ ఉద్యోగలు సత్వరమే బరువు తగ్గేలా చేయడంలో అద్భుతమైన ఫలితాలు కూడా సాధించింది. ఇలా ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 150 మంది ఉద్యోగులు దాక ఏకంగా 800 కిలోలు బరువు తగ్గి దాదాపు రూ. 83 లక్షల దాక రివార్డులు సంపాదించుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీలో పనిచేసే లి అనే వ్యక్తి మాట్లాడుతూ..తాను ఈ కార్యక్రమంలో నవంబర్‌ 2023లో చేరానని చెప్పాడు. ఆ శిక్షణ కార్యక్రమంలో రన్నింగ్‌, బాస్కెట్‌బాల్‌, స్విమ్మింగ్‌ వంటివి చేసి సుమారు 17.5 కిలోల మేర బరువు తగ్గి రూ. 80 వేలు బోనస్‌గా పొందానని తెలిపాడు. ఈ ప్రోగ్రాం తన ఆరోగ్యాన్ని, ఆర్థికస్థితిని మెరుగుపరిచిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీలో వెంటనే జాయిన్‌ అవుతానని ఒకరూ, మరోకరూ తాను ఏకంగా 10 కి.మీ వరుకు పరుగెత్తగలనని, తనలాంటి సిబ్బందితో తొందరగా ఆ కంపెనీ దివాలా తీసేస్తుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Modi Cabinet 2024:  all eyes now on portfolio allocation
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్‌!

న్యూఢిల్లీ, సాక్షి: కేం‍ద్రంలో కొత్త కేబినెట్‌ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క​ ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్‌ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ మీద తొలి కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్‌లో మోదీ మార్క్‌తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్‌ చేశాయి. జేడీఎస్‌ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్‌ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్‌లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం.

emmanuel Macron Dissolves Parliament Calls Snap Election On June 30
ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్‌ యూనియన్‌(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్‌ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్‌ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్‌ రెనాయిసెన్స్‌ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్‌ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్‌ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్‌ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్‌ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్‌ ప్రజలపై ఉ‍న్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అ‍న్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్‌ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement