విరాట్ కోహ్లి డౌటే..
ఢాకా: ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య వచ్చే నెలలో జరగనున్న రెండు టి20 మ్యాచ్లకు జట్లను ప్రకటించారు. ఆసియా ఎలెవన్ జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. పాకిస్తాన్ క్రికెటర్లకు మొండిచేయి చూపారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబర్ రెహమాన్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ మంగళవారం ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. ఆసియా ఎలెవన్ జట్టులో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి ఉన్నారు. అయితే కోహ్లి, రాహుల్ ఒక్క మ్యాచ్కు మాత్రమే అందుబాటులో ఉంటారు. వరల్డ్ ఎలెవన్ టీమ్కు డు ప్లెసిస్, క్రిస్ గేల్, జానీ బెయిర్స్టో తదితర ఆటగాళ్లను ఎంపిక చేశారు. కాగా, పీఎస్ఎల్లో బిజీగా ఉన్నందునే పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదని హాసన్ వెల్లడించారు.
మార్చి 21, 22 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉన్న టీమిండియా మార్చి 4న తన పర్యటనను ముగించనుంది. మార్చి 12 నుంచి 18 వరకు స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆసియా ఎలెవన్ ఆడతాడా, లేదా అనేది ప్రశ్నగా మారింది. కోహ్లి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.
ఆసియా ఎలెవన్ జట్టు
కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, తిసారా పెరీరా, లసిత్ మలింగ, రషీద్ ఖాన్, ముజీబ్ రహమాన్, ముస్తాఫిజుర్ రహమాన్, తమిమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, సందీప్ లామిచానే, మహ్మదుల్లా
వరల్డ్ ఎలెవన్ జట్టు
అలెక్స్ హేల్స్, క్రిస్ గేల్, డు ప్లెసిస్, నికోలస్ పూరన్, బ్రెండన్ టేలర్, జానీ బెయిర్స్టో, కీరన్ పొలార్డ్, షెల్డన్ కొట్రేల్, లుంగీ ఎంగిడి, ఆండ్రూ టై, మిచెల్ మెక్గ్లాన్, ఆదిల్ రషీద్
సంబంధిత వార్తలు