వారిని రోడ్డుకీడ్చిన కరోనా.. | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల్ని రోడ్డుకీడ్చిన కరోనా

Published Thu, Apr 9 2020 7:34 PM

Locked down: What Is The Fate Of migrant workers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజంభన, పర్యవసానంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలో దాదాపు 92.5 శాతం కూలీలు మార్చి నెలాఖరు నాటికి ఒక వారం నుంచి మూడు వారాల పాటు దినసరి వేతనాన్ని కోల్పోయారు. ఏప్రిల్‌ 14వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేశాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, తమకు మళ్లీ ఉపాధి దొరకుతుందని నమ్మకం లేదని ‘జన్‌ సాహస్‌’  నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. (ఏప్రిల్ వచ్చేసరికి మారిన పరిస్థితి..)

సామాజికంగా వెలివేతకు బలవుతున్న వర్గాల ప్రజల మానవ హక్కుల కోసం కృషి చేస్తోన్న జన్‌ సాహస్‌ మార్చి 27 నుంచి 29 వరకు ఉత్తర, మధ్య భారత్‌కు చెందిన 3,196 మందిని విచారించడం ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు సహా దినసరి వేతన జీవులు దేశ జనాభాలో సగం మంది ఉన్నారు. వారందరు రోజుకు 200 రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు సంపాదిస్తారు. వాస్తవానికి నైపుణ్యం కలిగిన, కొంత నైపుణ్యం కలిగిన, నైపుణ్యంలేని  క్యాటగిరీల కింద దినసరి వేతన జీవులకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు రోజుకు వరుసగా 692, 625, 571 రూపాయలు చెల్లించాలి. (భారత్లో 24 గంటల్లోనే 591 రోనా కేసులు)

లాక్‌డౌన్‌ సందర్భంగా ఇలాంటి వలస కార్మికులను, దినసరి వేతన జీవులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల రూపాయలతో ఓ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. అసంఘిటిత రంగంలో పని చేస్తున్న ఈ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఉన్నప్పుడే ఈ ఆర్థిక సహాయం అందుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ద్వారా కార్మికులకు ఆర్థిక సహాయం అందాలంటే వారికి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉండాలి. అయితే నేడు దేశంలో 18.8 శాతం కార్మికులు వద్దనే ఆ గుర్తింపు కార్డు ఉన్నట్లు తెల్సింది. (ఆసుపత్రి బయటే కరోనా శవాలు)

అంటే దాదాపు 82 శాతం మంది కార్మికులకు కార్డులు లేవు కనుక వారికి ఆర్థిక సహాయం అందే అవకాశం లేదు. వారిలో 60 శాతం మందికి ప్రభుత్వం స్కీమ్‌ల గురించిగానీ, గుర్తింపు కార్డు గురించిగానీ ఏమీ తెలియదని జన్‌ సాహస్‌ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల్లో 40 శాతం మందికి రేషన్‌ కార్డులు లేవట. కనుక వారికి రేషన్‌ సరకులు లభించే అవకాశం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ చివరి వరకు పొడిగిస్తే  ఇక వలస కార్మికుల దుస్థితి మరెంత దారుణంగా ఉంటుందో!? (వూహాన్లో లాక్డౌన్ ఎత్తివేత)

Advertisement
Advertisement