కశ్మీర్‌పై చర్చలు ప్రారంభిస్తాం! | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌పై చర్చలు ప్రారంభిస్తాం!

Published Tue, Oct 24 2017 1:57 AM

Former IB director Dineshwar Sharma to initiate Modi govt’s Kashmir dialogue - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) మాజీ డైరెక్టర్‌ దినేశ్వర్‌ శర్మకు అప్పగించింది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ వివరాలు వెల్లడిస్తూ..‘కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరి, నమ్మకంతో ఉంది. ఆ మార్గంలోనే ముందుకు సాగుతుంది. అందులో భాగంగా చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించాం.

అందుకే భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా దినేశ్వర్‌ శర్మను నియమిస్తున్నాం. కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలు, సంస్థలతో ఆయన చర్చలు కొనసాగిస్తారు’ అని తెలిపారు. ఇంతటి సున్నిత అంశంపై చర్చలు జరపగల సామర్థ్యం ఒక పోలీసు అధికారికి ఉంటుందా? అని ప్రశ్నించగా ‘అందులో తప్పేముంది. ఆయన రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి.అదే పెద్ద అనుకూల అంశం’ అని అన్నారు. 1979 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన దినేశ్వర్‌ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. కశ్మీర్‌పై చర్చల కోసం కేంద్రం చొరవను కశ్మీర్‌ సీఎం మెహబూబా స్వాగతించారు.

Advertisement
Advertisement