పాకిస్తాన్‌‌లో విషాదం.. 20 మంది మృతి

At Least 20 People Mostly Sikh Pilgrims Deceased Train Rams Bus Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షేక్‌పురా రైల్వే క్రాసింగ్‌ వద్ద రైలు, బస్సు ఢీకొన్న ఘటనలో దాదాపు 20 మంది  మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది సిక్కు యాత్రికులే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 27 మంది ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ విచారకర ఘటనపై పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిక్కు యాత్రికులు నంకానా సాహెబ్‌ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో పాకిస్తాన్ లో పలు ప్రార్థనా మందిరాలు తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్‌లోని తమ పవిత్ర స్థలం నంకానా సాహెబ్‌ను దర్శించేందుకు సిక్కులు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రధాని మోదీ సంతాపం
ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘పాకిస్తాన్‌లో జరిగిన ప్రమాదంలో సిక్కు యాత్రికులు మృతి చెందిన విషాదకర ఘటన వేదనకు గురిచేసింది. వారి కుటుంబాలు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’అని సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులైన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top