అభివృద్ధి ఆర్థిక అసమానతలు | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 16 2018 1:18 AM

Article On Economic Inequality In India By IYR Krishna Rao - Sakshi

ఫోర్బ్స్‌ పత్రిక వారు ప్రతి ఏటా భారతదేశంలో అత్య ధిక సంపన్న వంతుల జాబితాను ఒక దానిని ప్రక టిస్తూ ఉంటారు. అందులో ప్రథమ స్థానంలో చాలా ఏళ్లుగా ముఖేష్‌ అంబానీ పేరు ఉంటున్నది.  మొదటి వందమంది ప్రపంచ స్థాయి సంపన్నులలో ముఖేష్‌ అంబానీతోపాటు అజిత్‌ ప్రేమ్‌ జీ, శివ నాడార్‌ వంటి కొందరి పేర్లుఉంటాయి. భారతీయులుగా మనమంతా వారు సాధించిన విజయాలకు ప్రపంచస్థాయిలో వారి సంపద స్థాయికి గర్వపడుతుంటాము. అంత గర్వ పడవలసిన అంశం దీనిలో ఏమైనా ఉన్నదా?

2000–2014 మధ్య భారతదేశంలో పెరిగిన ఆదాయం ఎక్కువ భాగం అత్యున్నతంగా 10 శాతా నికి వెళ్లిందని మధ్యతరగతిగా పరిగణించబడే తరు వాతి 40 శాతం ఆదాయం 2000–2014 మధ్య గణ నీయంగా తగ్గిందని కాబట్టి మధ్యతరగతి వారి నుంచి బహుళజాతి సంస్థల వస్తువులకు భారతదే శంలో చైనాలోలాగా డిమాండ్‌ ఉండే అవకాశం లేదని అందువలన బహుళజాతి సంస్థలు వాటి కార్యక్రమాలు దేశంలో విస్తరించుకోవడం లాభదా యకం కాకపోవచ్చునని ఎకానమిస్ట్‌ పత్రికలోని వ్యాసం సారాంశం. ఆ విషయ వివరణకు వారు ఆధారపడిన గణాంకాలను చూస్తే మనకు ఇంకొక కోణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది దేశంలో 2000–2014 మధ్య వివిధ తరగతుల మధ్య ఆర్థిక అసమానతలు విస్తృతంగా పెరిగాయన్న  విషయం.

2000 సంవత్సరంలో అత్యధిక సంపద కలిగిన 10 శాతం జనాభా చేతుల్లో దేశ ఆదాయం 40 శాతం ఉంది. వారి తరువాత ఉన్న 40 శాతం జనాభాకు కూడా దేశ ఆదాయంలో 40 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక మిగిలిన 50 శాతం జనాభాకు దేశ ఆదాయంలో 20 శాతం వాటా ఉంది. 2014 సంవత్సరానికి అత్యధిక 10 శాతం జనాభా వాటా దేశ ఆదాయంలో 40 శాతం నుంచి దాదాపు 60 శాతం దాకా పెరిగింది. మిగిలిన 40 శాతం మధ్య తరగతి వాట 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకానమిస్ట్‌ పత్రిక లోని వ్యాసంలో మధ్యతరగతి వారి జాతీయ ఆదా యంలో వాటా పెరుగుదల బదులు తరుగుదల ఉన్నది కాబట్టి భారత్‌లో భవిష్యత్తులో బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు తగిన గిరాకీ ఉండకపోవచ్చు ననే నిర్ధారణకు ఆ వ్యాసకర్త వచ్చాడు. కేవలం భారత్‌ను అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు ఒక మార్కెట్‌ దృష్టితో చూశారు కాబట్టి ఆ వ్యాసకర్త దృష్టంతా మధ్యతరగతి వారి జాతీయ ఆదాయంలో వాటా తరుగుదల మీదనే ఉంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ ఆదాయ అభివృద్ధి పంపిణీలో మనదేశంలో ఉన్నంత అసమతౌల్యం కనిపించటం లేదని ఆ పత్రిక వారి అభిప్రాయం. కానీ ఆపై గణాంకాలు ఇంకొక ప్రమాదకరమైన ఆర్థిక అసమానతలను సూచిస్తున్నాయి. దేశ భవి ష్యత్తు దృష్ట్యా ఆ అంశంపై మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

అదేమిటంటే 50 శాతం జనాభాకు జాతీయ ఆదాయంలో భాగం 2000 సంవత్సరంలో 20 శాతం ఉంటే 2014 సంవత్సరా  నికి అది 15 శాతానికన్నా తగ్గింది. అంటే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి అని తెలుస్తూ ఉంది. జాతీయాదాయంలో మధ్యతరగతి, చివరి తరగతి ప్రజల వాటా తగ్గి 10% సంపన్న వర్గం వాటా గణనీయంగా పెరిగింది. దీని ప్రభా వమే భారతదేశం అతి విలాసవంతమైన వస్తువుల డిమాండ్‌ కొనుగోలు కేంద్రంగా ఏర్పడింది. మధ్య తరగతి ఆదాయం గణనీయంగా పెరిగితే బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశ ముంది. కానీ క్రింది 50 శాతం జనాభా ఆదాయం గణనీయంగా పెరిగితే దేశీయ సంస్థల ఉత్పత్తులకు గణనీయంగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. పైగా, 10 శాతం అత్యున్నత జనాభా సంపద పెరిగితే వారు విహారయాత్రకు స్కాట్లాండ్‌ దేశానికి పోయే అవకాశం ఉంది. మధ్యతరగతి వారి ఆదాయాలు పెరిగితే శ్రీలంక లాంటి దేశాలకు వెళతారు. కానీ చివరి 50 శాతం వారి ఆదాయాలు పెరిగితే వారు సందర్శించే స్థలాలు భారతదేశంలోనే ఉంటాయి. వారు చేసే ఖర్చు దేశ సంపదను పెంచుతుంది. భారత్‌ వస్తువుల తయారీపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ వస్తువులకు తగిన గిరాకీ ఏర్పడాలంటే 50 శాతం చివరి తరగతి జనాభా ఆదా యాలు గణనీయంగా పెరిగే విధానాలపై దృష్టి సారించాలి. అలా చేయనప్పుడు జాతీయ ఉత్పత్తి పెరుగుదల పేదరిక నిర్మూలనకు తోడ్పడకపోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక అసమానతలు సామాజిక ఉద్రి క్తతలకు దారి తీయవచ్చు. పై పది శాతం ఆదాయా భివృద్ధి విదేశీ వస్తువుల గిరాకీ పెంచడం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియా విధానానికి తోడు పడకపోవచ్చు.


ఐవైఆర్‌ కృష్ణారావు, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com
 

Advertisement

తప్పక చదవండి

Advertisement