తన వాటా కోసం తల్లిని గెంటేశాడు

Son Harassed Mother For Assets in East Godavari - Sakshi

తూర్పుగోదావరి,సర్పవరం(కాకినాడ రూరల్‌): ఆస్తి విలువ పెరగడంతో అప్పనంగా తమ్ముడికి ఉమ్మడి ఇల్లు వదలకూడదని అనుకున్న ఓ అన్న వాటా కోసం కన్నతల్లి అని చూడకుండా ఆమె ఉంటున్న గదికి తాళం వేసి బయటకు గెంటేసిన ఘటన ఇది. కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం గ్రామంలోని భావనారాయణపురంలో ఉంటున్న పిట్టా అప్పలరాజుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త చనిపోవడం, పిల్లలకు పెళ్లిళ్లై ఎవరి కాపురాలు వారు చేసుకుంటుండగా ఉమ్మడి ఇంటిలో ఒక ఫోర్షన్‌లో చిన్న కుమారుడు, మరో ఫోర్షన్‌ గదిలో తల్లి ఉంటున్నారు. పెద్ద కుమారుడు మాత్రం సుమారు 15ఏళ్ల క్రితం పట్టా స్థలంలో నివాసం ఏర్పచుకున్నాడు. అయితే తండ్రి ద్వారా లభించిన ఇంటిని తల్లి చిన్న కొడుకుకు ఇచ్చింది.

అక్కడే ఒక గదిలో ఆమె ఉంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల తల్లి వద్దకు వచ్చి ఇంటిలో భాగం ఇవ్వాలని పెద్ద కుమారుడు వాదనకు దిగాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆమె గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె గది బయటే ఉండగా చిన్న కుమారుడు చేరదీశాడు. ఇంటి వాటా కోసం రాకుండా ఉండేందుకు సుమారు రూ.రెండు లక్షలు కూడా పెద్ద కుమారుడికి ఇచ్చినా దౌర్జన్యం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై గ్రామ పెద్దలు, సర్పవరం పోలీసులను ఆశ్రయించగా వారు పెద్ద కుమారుడుని పిలిచి మందలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top