
ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య కారణాలతో ఎలక్ట్రీషియన్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో వెలుగు చూసింది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లుకు చెందిన హరి ప్రసాద్ (32) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య నాగవేణి రెండు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా హరిప్రసాద్ కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. వ్యాధులను బాగు చేసుకునేందుకు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. అయినా పరిస్థితి మెరుగు పడకపోగా నానాటికి క్షీణిస్తూ ఉండడంతో మానసికంగా కుంగిపోయాడు. వారం రోజుల క్రితం భార్య నాగవేణి కుమారుడిని, ఆమె పుట్టిల్లు అయిన చౌడేపల్లి మండలం చదళ్ల పంచా యతీ బోయపల్లెలో విడిచిపెట్టి వచ్చాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు విచారణ చేస్తున్నారు.
కుటుంబ సమస్యలతో..
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, భార్య అనారోగ్యం, అప్పులు తదితర కారణాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ములకలచెరువు మండలంలో వెలుగు చూసింది. మండలంలోని మద్దినాయన పల్లె పంచాయతీ నాయనవారిపల్లెకు చెందిన పెద్ద రెడ్డప్ప కుమారుడు శంకర (39) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య రాధమ్మ స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తూ ఉంది. ఆరు నెలల క్రితం ప్రమాదం కారణంగా రాధమ్మకు కాలు విరిగింది. ఆమెకు చికిత్స చేయించడానికి పలువురి వద్ద శంకర, దాదాపు రూ 10 లక్షలు అప్పులు చేశాడు. ఇటీవల కొంతకాలంగా రుణ దాతల నుంచి ఒత్తిడి అధికం కావడం. దీనికి తోడు కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవలు జరుగుతుండడం, తదితర కారణాలతో మనస్తాపం చెంది, బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో ములకలచెరువు పోలీసులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
జీవితంపై విరక్తితో..
లింగాల : మండలంలోని తాతిరెడ్డిపల్లె గ్రామంలో గురువారం గవిరెడ్డి శివారెడ్డి (60) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చాలా కాలం నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆలనా పాలనా చూసేందుకు భార్య లేకపోవడంతోపాటు గతంలోనే కుమారుడు మృతి చెందాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెంది తన పాత ఇంట్లో దంతెలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగాల పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య

ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య