
సెల్ఫోన్ లాక్కొని పరారైన దొంగ
లింగాల : మండలంలోని లోపట్నూతల గ్రామంలో సోమవారం సునీత తన కుమార్తె నైనికతో కలిసి పోస్టాఫీస్ వద్దకు వెళ్లి డబ్బులు కట్టి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి నైనిక చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని కొండలోకి పరారయ్యాడు. వెంటనే సునీత గట్టిగా అరవగా అక్కడ ఉన్న వాళ్లు సెల్ఫోన్ లాక్కొని పారిపోతున్న వ్యక్తిని వెంబడించగా కనబడకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా సెల్ఫోన్ దొంగ దొరకలేదు. దీంతో బాధితురాలు సునీత లింగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నలుగురిపై కుక్కల దాడి
కమలాపురం : కమలాపురం నగర పంచాయతీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం రాత్రి పొద్దుపోయాక పట్టణంలోని ఎస్బీఐ వెనుక వైపు ఉన్న కాలనీలో సుహానా అనే బాలికతో సహా నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కలతో పాటు పిచ్చి కుక్క కూడా సంచరిస్తున్నట్లు పట్టణ వాసులు తెలిపారు. నగర పంచాయతీ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు అంజద్, ప్రసాద్, రమేష్, నరసింహ ఫర్హాన్ తదితరులు కోరుతున్నారు.
అల్లాడుపల్లె అర్చీ వద్ద రోడ్డు ప్రమాదం
చాపాడు : మండల పరిధిలోని మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు, ఆల్విన్ లారీ ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం వద్ద జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని లక్ష్మీపేటకు భూమిరెడ్డి చంద్రఓబుళరెడ్డి అనే వ్యక్తి పిల్లలను తీసుకుని కారులో వెళుతుండగా క్రాస్ రోడ్డు వద్ద మైదుకూరు వైపు నుంచి వస్తున్న ఆల్విన్ లారీ ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతినింది.
మద్యం షాపులో చోరీ
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ కృష్ణ మద్యం షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగిందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మద్యం షాపు యజమాని రామసుబ్బారెడ్డి తమ షాపులో రూ. 30 వేలు విలువచేసే మద్య బాటిళ్లు, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 5వేలు నగదును అహపరించారని ఫిర్యాదు చేశారన్నారు.

సెల్ఫోన్ లాక్కొని పరారైన దొంగ