ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన కేసులో త్రీ టౌన్ పోలీసులు ఇరువురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చింతకొమ్మదిన్నె మండలంలోని మర్రి జాషువ, మైదుకూరుకు చెందిన మర్రి జయప్రకాష్లు అన్నదమ్ములు. వీరు జులాయిగా తిరుగుతుంటారు. ఈ క్రమంలో త్రీ టౌన్ పరిధిలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్కౌంటీ వద్ద ఇటీవల మహిళల మెడలో నుంచి బంగారు చైన్లను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ సుందరాచార్యుల వీధి మలుపు వద్ద ఉండగా సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు హనుమంతు, వెంకటరెడ్డి, సిబ్బంది దస్తగిరి, సుబ్రమణ్యం, కుమార్, హోంగార్డు జనార్దన్రెడ్డిలతో కలిసి వెళ్లి సోమవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 2.20 లక్షలు విలువైన రెండు బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండు నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.