
వెల్లాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజుపాళెం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజుపాళెం మండలంలోని వెల్లాలలో శ్రీ చెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే స్వాముల వారికి అభిషేకం, సహస్ర నామార్చన, ఆకుపూజ, కుంకుమార్చన, మహా మంగళహారతి వంటి పూజలు చేశారు. అంకురార్పణం, ధ్వజారోహణం అనే కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. భక్తులు స్వాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణంలో లైటింగ్, చలువ పందిళ్లు వేయడంతో పండుగ కళ వచ్చినట్లయింది. కార్యక్రమంలో ఈఓ వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మినారాయణ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామమోహన్, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు చెన్నకేశవుని కల్యాణం : వెల్లాలలోని సంజీవరాయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వాముల కల్యాణం శుక్రవారం జరగనుంది. కల్యాణోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు రావాలని, అలాగే రాత్రి శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహాలను పల్లకీపై ఊరేగించనున్నట్లు ఈఓ తెలిపారు.