అవినీతికి ఉపాధి హామీ! | - | Sakshi
Sakshi News home page

అవినీతికి ఉపాధి హామీ!

Apr 30 2025 1:56 AM | Updated on Apr 30 2025 1:56 AM

అవినీ

అవినీతికి ఉపాధి హామీ!

●ఒక్క కుప్పం గ్రామ పంచాయతీలోనే..

చక్రాయపేట: ఉపాధి హామీ పథకం పక్కదారి పట్టింది. సిబ్బంది చేతివాటానికి లెక్కాపత్రం లేకుండా పోయింది. నిబంధనలకు పాతరేస్తూ అధికారుల దోపిడీ పర్వం దర్జాగా సాగుతోంది. అడ్డగోలుగా మస్టర్లు రాస్తూ.. ఒకే ఫొటోను పలు ఐడీలకు అప్లోడ్‌ చేస్తూ లక్షల్లో నిధులు స్వాహా చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.

ఒకే ఫొటో ఐదారు మస్టర్లకు..

సాధారణంగా ఉదయాన్నే కూలీలు పనిలోకి రాగానే వారు పని చేస్తున్న వర్క్‌ఐడీకి సంబంధించి అధికారులు ఇచ్చిన మస్టరులో హాజరు వేయాలి. ఆ మస్టరుకు సంబంధించిన కూలీల గ్రూపు ఫొటో ప్రభుత్వం ఇచ్చిన యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హాజరు ఎలా ఉందో పనులు ఎవరు చేస్తారో తెలియదు కాని కూలీల గ్రూప్‌ ఫొటో మాత్రం ఐదారు మస్టర్లకు ఒకటే అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీనికితోడు చిన్నపిల్లలను కూడా ఉపాధి పనులకు వచ్చినట్లు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తుండడం గమనార్హం.

వారానికి లక్ష...

పనులకు రాని వారిని.. విదేశాల్లో ఉన్న వారిని సైతం పనికి వస్తున్నారని హాజరువేస్తూ ఆ డబ్బు మింగేస్తున్నారు. ఒక మస్టరులో 10 మంది కూలీలు ఉంటే వారానికి రు.16వేలు డబ్బు పడుతుంది. ఒక్కో మస్టరులో ఐదారుమందే పని చేస్తుంటారు. ఫొటోలు మాత్రం పది మంది చేస్తున్నట్లు అప్లోడ్‌ చేస్తున్నారు. దీంతో వివిధ మస్టర్లకు సంబంధించి వారానికి సుమారు 80నుంచి 90 వేలు వరకు సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక మస్టరు పైనే నెలకు రు.3లక్షల పైనే నొక్కేస్తుంటే ఇలాంటి మస్టర్లు గ్రామానికి ఎన్ని ఉంటాయో సదరు సిబ్బందికే ఎరుక.

ఉత్తుత్తిగా సామాజిక తనిఖీ

ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలను వెలికి తీస్తారని లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం సామాజిక తనిఖీ బృందాలను పంపుతోంది. సదరు సామాజిక తనిఖీ బృందాలు విచారణ తూతూమంత్రంగా చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి పరిహారంగా వీరికి లక్షలు ముట్టజెబుతున్నట్లు అర్థమవుతోందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఒకే ఫొటో ఐదారు మస్టర్లకు అప్‌లోడ్‌ చేస్తున్న వైనం

కువైట్‌లో ఉన్న వారు పనికివచ్చినట్లు మస్టర్లలో హాజరు

పనికి రాకున్నా ఖాతాల్లోకి నగదు

లక్షల్లో స్వాహా చేస్తున్న ఉపాధి సిబ్బంది

నాలుగైదు రోజులుగా చూస్తే కుప్పం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న దినసరి కూలీల సంఖ్య వందల్లో ఉంటోంది. ఫొటోలు చూస్తే ఒకే గ్రూప్‌ ఫొటో ఐదారు మస్టర్లకు అప్‌లోడ్‌ చేస్తున్నారు.తిరిగి వారిలోంచే కొందరిని విడదీసి మరో ఫొటో తీసి మరి కొన్ని మస్టర్లకు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన వర్క్‌ ఐడీ నెంబరు 83048 కు సంబంధించి అధికారులు కూలీల హాజరుకు గాను మస్టర్లు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఇచ్చారు. 884, 885, 886, 890, 891, 893 ఈమస్టర్లు ఆరు గ్రూపులు ఒకే వర్క్‌ ఐడీలో పని చేస్తున్న కూలీలకు సంబంధించినవి. ఒక్కొక్క మస్టరుకు ఒక్కో గ్రూపుకు సంబంధించిన కూలీల గ్రూపు ఫొటో మాత్రమే అప్‌లోడ్‌ చేయాలి. కాని ఇక్కడ పై ఆరు మస్టర్లను పరిశీలిస్తే ఒక గ్రూపునకు చెందిన కూలీలే అన్ని మస్టర్ల కు సంబంధించి గ్రూప్‌ ఫొటో అప్‌లోడ్‌ చేశారు. ఈ తంతు ప్రతి రోజు జరుగుతోంది. ఒక కూలీకి రోజుకు సుమారు మూడొందలు తక్కువ కాకుండా లెక్క పడేలా చేసి డబ్బు పడగానే వాటిని డ్రా చేయించుకొని పంచుకుంటుకుంటున్నారు. ఇందులో కొంత మొత్తం సాంకేతిక సహాయకులు తీసుకొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరికై తే పాత గుంతలు జిగిరి వెళ్లండి మీకు మూడొందలు కూలి పడేలా చేస్తా మని చెప్పి.. రెండొందల చొప్పున కూలీల నుంచి లాగేసు కుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే నెరుసుపల్లె పంచాయతీలో చిన్న పిల్లల ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు.ఇదే పంచాయతీలో చంద్రకళ అనే మహిళ గల్ఫ్‌ దేశాలకు వెళ్లింది.అయితే ఆమె రోజూ పనులకు వస్తున్నట్లు హాజరు వేస్తున్నారు. ఇక్కడ పాత గుంతలను జిగిరించి కొత్తవిగ చూపుతున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: ఏపీఓ షబ్బీర్‌

ఉపాధి హామీలో అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే అలాంటి వారిపై విచారణ జరిపి తగు చర్యల నిమిత్తం ఉన్నతాది కారులకు నివేదిక పంపుతామని ఏపీవో షబ్బీర్‌ తెలిపారు. ఐదారు మస్టర్లకు ఒకే ఫొటో అప్‌లోడ్‌ చేస్తున్నారనే విషయంపై అడగ్గా.. తాను కొత్తగా వచ్చానని,మీటింగ్‌ పెట్టుకొని మందలించి ఇకపై అలా జరుగకుండా చూస్తామని జవాబిచ్చారు.

అవినీతికి ఉపాధి హామీ!1
1/1

అవినీతికి ఉపాధి హామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement