చౌటుప్పల్: దాబా వద్ద కారులో నిద్రిస్తున్న వారి నుంచి రూ.2.21లక్షలను ఓ దుండగుడు చోరీ చేశాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముడిగొండ మండలం పాండ్రేగుపల్లి గ్రామానికి చెందిన కాట్రాల ఉపేందర్ తన అత్త తిరుపతమ్మ వైద్య చికిత్స కోసం శనివారం తమ గ్రామానికే చెందిన వేరా బాబుతో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్లారు. తిరుపతమ్మను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం తర్వాత స్వగ్రామానికి బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోనే నివాసముండే తమ గ్రామానికే చెందిన పాశం పావని రూ.1.48లక్షలు, కాట్రాల శ్రీను రూ.73వేలు వీరికి ఇచ్చి గ్రామంలోని తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సూచించారు. ఆదివారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రి నుంచి బయల్దేరి రాత్రి 7.30గంటల ప్రాంతంలో దిల్సుఖ్నగర్కు చేరుకున్నారు. అక్కడ ఉపేందర్ స్నేహితుడైన గోవిందరావు కలవడంతో ముగ్గురు కలిసి మద్యం సేవించారు. రాత్రి 9గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఇద్దరూ బయల్దేరారు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని స్వాతి దాబా వద్ద ఆగి రొట్టెలు తిన్నారు. అనంతరం నిద్ర వస్తుండడంతో డ్రైవింగ్ చేయలేమని భావించి కారును అక్కడే ఆపుకొని ఇద్దరూ కూడా కారులోనే నిద్రించారు. తమ వద్ద ఉన్న నగదును కారు డ్యాష్ బోర్డులో పెట్టుకున్నారు. అర్ధరాత్రి దాటాక 2.40గంటల ప్రాంతంలో మెలుకువ వచ్చి చూడగా.. డ్యాష్ బోర్డులో దాచిన నగదు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాబా ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని చూడగా.. అర్ధరాత్రి సమయంలో స్కూటీపై ఓ దుండగుడు వీరిని వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కారు డ్యాష్ బోర్డులో దాచి ఉన్న రూ.2.21లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారులో నుంచి రూ. 2.21లక్షలు
ఎత్తుకెళ్లిన దుండగుడు
చౌటుప్పల్ మండలం
దండుమల్కాపురం వద్ద ఘటన
సీసీ కెమెరాల్లో నమోదైన దోపిడీ దృశ్యాలు