
పుస్తకాల వ్యాపారంపై ఫిర్యాదు
ఆకివీడు: స్థానిక చైతన్య విద్యాసంస్థలో పుస్తకాలు విక్రయిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ నాయకుల ఫిర్యాదు మేరకు శుక్రవారం విద్యాశాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. అనంతరం పాఠశాలలో పుస్తకాలు ఉండే గదికి తాళం వేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే పుస్తకాల వ్యాపారం లక్షల్లో జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థ అయిన చైతన్య స్కూల్లో పుస్తకాల విక్రయాన్ని తమ నాయకులు అడ్డుకున్నారని చెప్పారు. అధికంగా ఫీజుల వసూలుతో పాటు విద్యా సామగ్రి అమ్మకాల ద్వారా కార్పొరేట్ సంస్థలు కోట్లు గడిస్తున్నాయన్నారు. పుస్తకాల విక్రయంపై మండల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారని, నోటీసులు ఇచ్చామని చెబుతున్నారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లిప్తంగా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా సహాయ కార్యదర్శి పి.నాగేంద్ర, కె.గోవింద్, కె.రోహిత్, పట్టణ నాయకులు సాయి, వంశీ, సాయి కృష్ణ పాల్గొన్నారు.