లాకర్‌లో బంగారు ఆభరణం మాయం | - | Sakshi
Sakshi News home page

లాకర్‌లో బంగారు ఆభరణం మాయం

Jun 7 2025 12:50 AM | Updated on Jun 7 2025 1:14 AM

లాకర్‌లో బంగారు ఆభరణం మాయం

లాకర్‌లో బంగారు ఆభరణం మాయం

ఆకివీడు : ఇంట్లో ఉంటే దొంగల బెడద అని భయపడి బ్యాంక్‌ లాకర్‌లో దాచుకున్న బంగారు ఆభరణం మాయమైపోయిన సంఘటనపై బాధితురాలు వల్లభుని శ్రీ పూర్ణ లక్ష్మి శుక్రవారం బ్యాంక్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా పలువురు మహిళలు, సీపీఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. గత ఇరవై రోజులుగా లాకర్‌లో బంగారు వస్తువు మాయమైందని బ్యాంక్‌ అధికారులకు మొరపెట్టుకున్నా సరైన సమాధానం చెప్పడంలేదని, తమది బాధ్యత కాదని బ్యాంక్‌ మేనేజర్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆమె వాపోయారు. 27 కాసుల ఆభరణం లాకరులో ఎలా పోతుందని ఆమె బ్యాంక్‌ అధికారుల్ని నిలదీశారు. సీసీ పుటేజ్‌ల వివరాలు ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నారని ఆమె వాపోయారు. విషయాన్ని మేనేజర్‌ ఎస్సైకు తెలియజేయడంతో ఆయన వచ్చి మాట్లాడారు. సోమవారం సీపీ పుటేజ్‌లను సాంకేతిక నిపుణులతో పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు ఎస్సై నాగరాజుకు తెలిపారు. బ్యాంక్‌ మేనేజర్‌ మాట్లాడుతూ లాకర్‌లో ఉన్న వస్తువులు ఏం ఉన్నాయో తమకు తెలియదని, బ్యాంక్‌లో పోయే అవకాశం లేదన్నారు. ఎస్సై నాగరాజు మాట్లాడుతూ బ్యాంక్‌లోని సీసీ పుటేజ్‌ సేకరించామని, గతంలో ఓపెన్‌ కాలేదని.. సాంకేతిక నిపుణుడు సాయంతో సోమవారం పరిశీలిస్తామన్నారు.

అక్రమంగా అమ్ముతున్న వరి విత్తనాల సీజ్‌

కలిదిండి(కై కలూరు): నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వరి విత్తన బస్తాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసిన ఘటన కలిదిండి మండలం సానారుద్రవరంలో శుక్రవారం జరిగింది. శ్రీ వేంకటేశ్వర సీడ్స్‌ విక్రయ దుకాణాన్ని మారుబోయిన సత్యనారాయణ నిర్వహిస్తుండగా.. వ్యవసాయశాఖ జేడీ హబీబ్‌ బాషా, ఏడీ ఆర్‌.గంగాధరరావు, ఏఓ కె.విద్యాసాగర్‌ తనిఖీ చేశారు. దాడుల్లో 710 క్వింటాళ్ల వరి విత్తన బాస్తాలు పట్టుబడ్డాయి. వీటి విలువ మార్కెట్‌లో రూ.21,63,500 ఉంటుందని అధికారులు చెప్పారు. వరి విత్తనాలు విక్రయించాలంటే 30 కేజీల బస్తాలు కలిగిన లేబుల్‌ సీల్‌ ఉండాలి. బ్యాగ్‌పై తయారీ తేదీ, వివరాలు, ప్యాకింగ్‌ ప్రాంతం, విత్తన రకం వంటి వివరాలు ఉంటాయి. అవేమీ లేకుండా 40 కేజీల వరి విత్తనాల బస్తాలు రూ.1,200కు విక్రయిస్తున్నాడు. ఎలాంటి బిల్లులు లేకుండా విత్తనాలు విక్రయించడం నేరమన్నారు. స్వాధీనం చేసుకున్న ధాన్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతామన్నారు. ల్యాబ్‌ నివేదికను బట్టి విక్రయదారుడిపై కేసు నమోదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement