
మూణ్నాళ్ల ముచ్చటగా రోడ్డు మరమ్మతులు
భీమవరం అర్బన్ : భీమవరం మండలంలోని గూట్లపాడు రేవు నుంచి దొంగపిండి వరకు ఆర్ అండ్ బీ రోడ్డుపై చేపట్టిన రోడ్డు మరమ్మతులు మూడు నెలలు గడవక ముందే పాడయ్యాయిజ గూట్లపాడు రేవు, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి వరకు సుమారు 10 కిలోమీటర్లు గతంలో రోడ్డు ధ్వంసమవడంతో ఆర్అండ్బీ అధికారులు టెండర్ ప్రక్రియ ద్వారా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ ఉపయోగించి రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో గోతులు ఏర్పడుతున్నాయి. ఈ మార్గం గుండా నిత్యం స్కూల్ బస్సులు, చేపల లారీలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రోడ్డు వేసేటప్పుడు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్డు మరమ్మతులు చేపట్టి మూడు నెలలు గడవకు ముందే ధ్వంసమైంది. దీంతో ఈ రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు.