
సొంత విత్తనాలే శ్రేయస్కరం
పెనుమంట్ర: రైతులు తమ విత్తనాలను తామే పండించుకోవడం వల్ల ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా నాణ్యమైన ఆరోగ్యకరమైన విత్తనాలు లభిస్తాయని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి సహా పరిశోధనా సంచాలకులు డా.బి. సహదేవరెడ్డి అన్నారు. సార్వా విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మార్టేరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన ఎంటీయూ 1318 రకం రైతుల మన్ననలు పొంది రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని తెలిపారు. రైతులు స్వర్ణ రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ – 1318ని సాగుచేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ రకం సాగుచేసే రైతులు ఎకరాకు సిఫారసు చేసిన 36 కిలోల నత్రజనికి బదులుగా 24 కిలోల నత్రజనిని కేవలం రెండు దఫాలుగా నాటే సమయంలోనూ, చిరుపొట్ట దశలోనూ వేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో పంటకాలం పెరిగే అవకాశంతో పాటూ, ఎండు తెగులు, మానుకాయ ఆశించే ప్రమాదముందన్నారు. ఎంటీయూ 1121లో ఎక్కువ నూక శాతం రావడానికి గింజ గట్టిపడే దశలో వర్షాలు కురవడం, ఎక్కువకాలం పంట కోయకుండా చేనుపైనే ఉంచడం కూడా కారణమని తెలిపారు.
స్వర్ణకి ప్రత్నామ్నాయంగా ఎంటీయూ 1318
ప్రధాన శాస్త్రవేత్త (వరి) డా.ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ ఎంటీయూ 1310 రకం గతేడాది ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాల్లో రైతుల మన్ననలు చూరగొందని చెప్పారు. స్వర్ణకి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఎంటీయూ 1318 గోదావరి మండలంలోని ఐదు జిల్లాల్లో సుమారు 36 శాతం విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని తెలిపారు. అదేవిధంగా సన్న గింజ రకాలైన ఎంటీయూ 1224, ఎంటూ 1262 కృష్ణా జిల్లాలో అధిక విస్తీర్ణంలో బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా సాగుచేయబడుతుందన్నారు. చౌడు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంసీఎం 103 రకం మంచి దిగుబడులు ఇస్తుందని తెలిపారు. సన్న గింజ రకాలైన బీపీటీ 2846, 2782 రకాలను మామూలు భూముల్లో సాగుచేయవచ్చని ఆమె వివరించారు. ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంటీయూ 1232, 1140, 1172, 1223, పీఎల్ఏ 1100 సాగుచేసుకోవాలని తెలిపారు. దాళ్వాలో ఎంటీయూ 1121, 3626తో పాటుగా పీఆర్ 126కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఎంటీయూ 1010, 1293, 1290, 1156, 1153 రకాలు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మన్ననలు పొందాయని తెలిపారు.
ఎంటీయూ 1426 కిట్లు రైతులకు అందజేత
ఈసందర్భంగా పలువురు రైతులకు ఆర్ఎన్ఆర్ 15048 రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన చిరుసంచి రకం ఎంటీయూ 1426 కిట్లను అభ్యుదయ రైతులకు అందజేశారు. శాస్త్రవేత్తలు డా.ఎంవీ కృష్ణాజీ డా.ఎస్.దయాకర్, డా.సీహెచ్ శ్రీనివాస్, డా.వి.భువనేశ్వరి, డా.ఎన్.శ్రీనివాస రావు, డా.ఎ.ఆనంద్ కుమార్, డా.ఎన్.వెరోనికా, డా.వి.రోజా పాల్గొన్నారు.
మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి సహదేవరెడ్డి