
వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త
ఆగిరిపల్లి: వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పశువుల పట్ల పాడి రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని, పశువులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. జీవాలు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వెంటనే 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంతో వైద్యులే ఇంటికి వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆగిరిపల్లి మండల పశువైద్యాధికారి జి.హనుమంతరావు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.
గాలి కుంటు వ్యాధిపై అప్రమత్తం
గాలికుంటు వ్యాధి ఎక్కువగా ఆవులు, ఎద్దులు, గేదెలకు సోకుతుంది. వ్యాధి బారిన పడిన పశువు శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీలకు పెరుగుతుంది. పశువునోట్లో, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఆహారం సరిగా తీసుకోలేవు. దీంతో నీరసంగా మారి నడిచేందుకు కూడా కష్టపడతాయి. పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. వ్యాధి నివారణ కోసం వైద్యులు సూచనల మేరకు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులను వాడాల్సి ఉంటుంది.
కలుషిత నీటితో జలగవ్యాధి
మురుగునీరు, కలుషిత నీరు తాగడం వల్ల పశువులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా గేదెలు, దూడలు, గొర్రెలు, మేకలు వంటి జీవాలకు ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులు మేత తినడంలో ఇబ్బందులు పడతాయి. పాల దిగుబడి క్షీణిస్తుంది. జలగ వ్యాధి బారిన పడిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. డిస్టోడిన్ 4 మాత్రలు, 100 మిల్లీ లీటర్ల నియోజడ ప్లస్ను అందించాలి.
నట్టల వ్యాధితో ఎదుగుదలకు బ్రేక్
పశువులు పచ్చి మేత తిన్నప్పుడు నులిపురుగుల సమస్య వస్తుంది. దీంతో వాటి ఎదుగుదలకు అవకాశం ఉండదు. జీవాలు తిన్న ఆహారం అంతా నులిపురుగులే స్వాహా చేస్తాయి. దీంతో జీవాలు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా గొర్రెలు ఈ వ్యాధి బారిన పడతాయి. పశుసంవర్థక శాఖ ముందుజాగ్రత్త చర్యగా ఆరు నెలలకు ఒకసారి పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారు.
గొంతు వాపు.. ప్రాణాంతకం
పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కంటి నుంచి నీరు కారటం, నోటి నుంచి చొంగకారడం, శ్వాస పీల్చడానికి ఇబ్బందులు పడుతుంటాయి. గొంతు కిందకు నీరు దిగి గొంతు వాపు వస్తుంది. తీవ్రత ఎక్కువైతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా జూన్, జులై నెలల్లో (హెచ్ ఎస్) టీకాలు వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన పశువును మిగిలినవాటి నుంచి దూరం చేయాలి.
ఈటీ వ్యాక్సిన్తో చిటుకు వ్యాధికి చెక్
వర్షాకాలంలో పశువులకు ఎక్కువగా సోకే మరో వ్యాధి చిటుకు వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం జూన్, జూలై మాసంలో ఈటీ వ్యాక్సిన్ వేస్తారు. రైతులు పశువులకు సంబంధించిన వ్యాధులను సకాలంలో గుర్తించి తగిన వైద్యం అందించాలి.
జి .హనుమంతరావు. పశు వైద్యాధికారి, ఆగిరిపల్లి

వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త

వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త