చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి

May 31 2025 1:26 AM | Updated on May 31 2025 1:41 AM

చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి

చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి

ద్వారకాతిరుమల: గత నాలుగు రోజుల నుంచి క్షేత్రంలోని చెరువు వీధిలో ఒక పిచ్చికుక్క పిల్లలపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది పిల్లలపై ఈ కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరచింది. శుక్రవారం సాయంత్రం చెరువు వీధిగుండా శ్రీవారి ఆలయానికి వెళుతున్న లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిల రవి అనే భక్తుడి కుమారుడు యశ్వంత్‌పై ఈ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైస్సార్‌ సీపీ నాయకుడు కొల్లిసుబ్బారావు క్షతగాత్రుడిని హుటాహుటీన పీహెచ్‌సీకి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుడాల మదన్‌మోహన్‌ కుమారుడు నవదీప్‌పై కుక్క దాడి చేసి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. స్థానికులు వెంటపడటంతో బాలుడిని విడిచిపెట్టి పరారైంది. వెంటనే తల్లిదండ్రులు అతడిని పీహెచ్‌సీకి తరలించగా, వైద్య సిబ్బంది చిన్నారులకు యాంటి ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో ఏవీ సుబ్బరాయన్‌ పిచ్చి కుక్కను పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పట్టించి, దూర ప్రాంతానికి తరలించారు.

పోక్సో కేసులో

లాడ్జి యజమాని అరెస్ట్‌

భీమవరం: మైనర్‌ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న నేరంలో భీమవరం టూటౌన్‌ పరిధిలోని శ్రీనిధి లాడ్జి యజమాని అయితం శ్రీనివాస్‌ను పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ జి కాళీచరణ్‌ చెప్పారు. ఈనెల 12న వ్యభిచారం నేరంపై బాలికలను అరెస్ట్‌ చేయగా వారికి రూమ్స్‌ అద్దెకిచ్చిన శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చామని, 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నరసాపురం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు.

బాలిక ఆత్మహత్యాయత్నం

పెదవేగి : ప్రేమ పేరుతో లోబరుచుకుని అనంతరం నిర్లక్ష్యం చేస్తుండడంతో మనస్తాపం చెందిన మైనర్‌ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన పెదవేగి మండలం రామచంద్రపురంలో చోటు చేసుకుంది. ఏడాది కాలంగా గ్రామానికి చెందిన యువకుడు హెచ్చు గణేష్‌, మైనర్‌ బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుతం ఆమెను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఆమె ఫోన్‌ను గణేష్‌ బ్లాక్‌ చేయడంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పెదవేగి ఎస్సై కె రామకృష్ణ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కాళ్ల: సీసలిలో గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాల ప్రకారం సీసలి గ్రామంలో అడుగంటిన చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానిక వీఆర్వో సుధాకర్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఒంటిపై నైట్‌ ప్యాంటు మాత్రమే ఉండి, కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందన్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఏఎస్సై వీవీఎస్‌ రామరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement