చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్‌ చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్‌ చేస్తున్నారు

May 31 2025 1:26 AM | Updated on May 31 2025 1:41 AM

చట్టా

చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్‌ చేస్తున్నారు

ఏలూరు (టూటౌన్‌): పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్‌ చేస్తూ సర్పంచ్‌ల విధులు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మెండెం సంతోష్‌ కుమార్‌ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు అధికారులను అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో సర్పంచ్‌లకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్‌ చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సర్పంచ్‌ చిలకా సుబ్బారావు, నాయకులు నూకపెయ్యి కార్తీక్‌, కనికెళ్ళ రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

నూజివీడు: ట్రిపుల్‌ ఐటీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి గాను ఆయా కేటగిరికి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడోరోజు శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ నందు వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా క్రీడా కోటాకు సంబంధించి 467మందికి గాను 344 మంది, ఎన్‌సీసీ కోటాకు సంబంధించి 452 మందికి గాను 354 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌, ప్రొఫెసర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, ఏఆర్‌ అర్జునరావు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 31న ఎన్‌సీసీ కేటగిరికి చెందిన 661మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండిలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం ఆకివీడుకు చెందిన షేక్‌ రియాజ్‌ (41) స్థానిక క్రికెటర్‌. అతను ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మెడికల్‌షాపు ఇన్‌చార్జ్‌గా పనిచేయడంతోపాటు, క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్నాడు. గురువారం అండర్‌–19 క్రికెట్‌ సెలక్షన్స్‌ గురించి మాట్లాడేందుకు ద్విచక్రవాహనంపై భీమవరంలో వెళ్లిన అతను తిరిగి అర్థఽరాత్రి 1.30 గంటలకు ఆకివీడు వస్తుండగా ఉండిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కరెంటుస్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిక భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. షేక్‌ రియాజ్‌ భార్య పర్విన్‌ ఫిర్యాదు మేరకు ఏఎస్సై శ్రీనివాస్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్‌ చేస్తున్నారు 1
1/1

చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్‌ చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement