పడకేసిన పల్లె పాలన | - | Sakshi
Sakshi News home page

పడకేసిన పల్లె పాలన

May 29 2025 12:48 AM | Updated on May 29 2025 2:12 PM

పడకేస

పడకేసిన పల్లె పాలన

కూటమి పాలనలో గ్రామ వ్యవస్థలు నిర్వీర్యం

అలంకారప్రాయంగా సచివాలయాలు, ఆర్బీకేలు

సేవలందక ప్రజలు, రైతులకు ఇక్కట్లు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌లతో మెరుగైన సేవలు

రూ. 259 కోట్లతో 865 సొంత భవనాలు

5266 సచివాలయ ఉద్యోగులు, 8,616 వలంటీర్లతో ఇంటింటికీ సేవలు

సాక్షి, భీమవరం: ప్రజల వద్దకు పాలన, సంక్షేమానికి శ్రీకారం చుడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థలతో పాలనను చెంతకు చేర్చారు. అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వైద్యసేవల కోసం హెల్త్‌ క్లినిక్‌లను తెచ్చింది. వాటికోసం ఊరూరా ప్రత్యేక భవన నిర్మించింది. గ్రామ స్వరాజ్యానికి ఊపిరిలూదిన ఈ వ్యవస్థల్ని కూటమి సర్కారు నిర్వీర్యం చేస్తోంది. సేవలందించలేక సచివాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. ఆర్‌బీకేలు మూతపడుతున్నాయి. హెల్త్‌ క్లినిక్‌ల్లో వైద్యసేవలు కుంటుపడ్డాయి. ఆరేళ్ల కిందట పంచాయతీల్లో చాలావరకు సెక్రటరీ, బిల్‌ కలెక్టర్‌, అటెండర్‌ మాత్రమే ఉండేవారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు వ్యయప్రయాసల కోర్చి మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. 

2019 అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు జీవం పోశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాలు ఏర్పాటు చేశారు. గ్రేడ్‌ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ సర్వేయర్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్‌, ఉద్యానవన అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను ఏర్పాటు చేశారు. తద్వారా జిల్లాలో ఐదు వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున 8,616 మందిని నియమించారు.

సచివాలయ ఉద్యోగులకు ఇక్కట్లు : కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తోంది. చాలావరకు సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వలంటీర్లను తొలగించగా, సర్వేల పేరిట సచివాలయ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ పనులు పురమాయిస్తోంది. జిల్లాలోని సచివాలయాల్లో 1,066 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది.

సొంత భవనాల నిర్మాణం

గ్రామీణ వ్యవస్థల కోసం గత ప్రభుత్వం సొంత భవనాలను సమకూర్చింది. ఉద్యోగులు, ప్రజావసరాలకు అనుగుణంగా వీటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షలు చొప్పున జిల్లాలో 353 భవన నిర్మాణాలకు సుమారు రూ.141.2 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 270 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆర్బీకేకు రూ. 22 లక్షలు చొప్పున రూ.65 కోట్ల వ్యయంతో 298 భవన నిర్మాణం చేపట్టగా గత ప్రభుత్వంలోనే 211 భవనాలను పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. ఒక్కో హెల్త్‌ క్లినిక్‌కు సుమారు రూ.25 లక్షల చొప్పున జిల్లాలోని రూ.53.5 కోట్లతో 214 భవనాలు చేపట్టి 96 భవనాలు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. కూటమి వచ్చాక మిగిలిన వాటిని పూర్తిచేయకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయాయి.

గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాలు

గత ప్రభుత్వం కుల మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా.. గత ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే భవనాల్లో ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.

– గొంతే హరీష్‌, పాందువ్వ, ఉండి మండలం

వైద్య సేవలు బంద్‌

గతంలో వైద్య సేవలు ఇంటి ముందుకు వచ్చేవి. ప్రతి నెల వైద్యులు వచ్చి ఆరోగ్య పరి స్థితులను అడిగి తెలుసుకుని అవసరమైన మందులు ఇచ్చేవారు. అప్పటి మాదిరిగా ఇప్పటి ప్రభుత్వంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నాం.

– తామరపల్లి ముసలయ్య, పెద్దిరెడ్డిపాలెం, ఇరగవరం మండలం

ఇంటింటికి వైద్య సేవలు ఎక్కడ?

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు. గతంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుతోపాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

– చిట్టూరి లక్ష్మి, వీరవాసరం

ఆర్బీకేలు నిర్వీర్యం

గతంలో ఆర్బీకే ద్వారానే అన్ని సేవలు అందించేవారు. ఇప్పుడు ఎలాంటి మందులు ఇవ్వడం లేదు. సమాధానం చెప్పేవారు కూడా ఉండటం లేదు. ఎరువులు, పురుగు మందులు కమిషన్‌ వ్యాపారి వద్ద తెచ్చుకుంటున్నాం.

– సేలంశెట్టి నాగేశ్వరరావు, రైతు, ఎల్‌ అగ్రహారం

మాది నరసాపురం మండలం సరిపల్లి గ్రామం. రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. దాళ్వాలో 1053 రకం సాగుచేయగా ధాన్యం కొనుగోలుకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆఖరుకు క్వింటాకు మూడు కిలోలు తగ్గించి కొన్నారు. డబ్బులు ఇప్పటికీ అకౌంట్‌లో వేయలేదు. మళ్లీ రైతుభరోసాకు దరాఖాస్తు చేయమని చెపితే రెండు రోజుల నుంచి గ్రామంలో సచివాలయానికి తిరుగుతున్నాను. ఎవరూ సమాధానం చెప్పడంలేదు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఇబ్బంది లేదు. వలంటీర్లు ఉండేవారు, మరోపక్క సచివాలయం, ఇంకో పక్క రైతుభరోసా కేంద్రం ఉండేది.
– జొన్నాడ అప్పారావు

పడకేసిన పల్లె పాలన 1
1/2

పడకేసిన పల్లె పాలన

పడకేసిన పల్లె పాలన 2
2/2

పడకేసిన పల్లె పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement