
14న అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
ఏలూరు (టూటౌన్): భారతీయ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జూన్ 14 నుంచి 22 వరకు అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఈమేరకు ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అయోధ్య–కాశీ యాత్రలో భాగంగా వారణాసి, ఆయోధ్య, ప్రయాగ్రా, నైమిశారణ్యం ప్రాంతాల్లోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చునన్నారు. యాత్ర మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగలు సాగుతుందన్నారు. ఈ నెల 14న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైలు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వెళుతుందన్నారు. టిక్కెట్ల బుకింగ్ కొరకు ఐఆర్సీటీసీ, రైల్వే రిటైరింగ్ రూమ్ దగ్గర, విజయవాడ రైల్వే స్టేషన్ నందు గాని ఆన్లైన్ నందుగాని చేసుకోవచ్చునన్నారు. వివరాలకు సెల్ నెం.9281495848 నందు సంప్రదించాలని కోరారు.