
వైద్య విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి
ఏలూరు టౌన్: ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, ఆయుష్మాన్ భారత్ విభాగం వద్ద, సాంఘిక సంక్షేమ వసతి గృహాల సముదాయాల వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి, రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ నరసింహం, సహాయ సంచాలకుడు వెంకటేష్, ఎమ్మెల్యే బడేటి చంటి, వివిధ శాఖల అధికారులతో కలిసి కృష్ణబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, వివిధ వైద్య విభాగాలలో స్పెషలిస్ట్ కోర్స్లు 750 మంది పైగా అభ్యసిస్తారని, ఆ సామర్థ్యానికి తగినట్లు ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు. వసతి గృహ భవనాలు వైద్య కళాశాలకు దగ్గరలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం వివరాలు స్పెషల్ సీఎస్కు వివరించారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఎిస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, వైద్యారోగ్య శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తీసుకోని వాటిని సరిచేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10 నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సరైన ఆధారాలతో విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
సమ్మె విజయవంతం చేయాలి
ఏలూరు (టూటౌన్): కేంద్రం కార్మిక హక్కులను హరించి వేస్తోందని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు, కో కన్వీనర్ వెంకట కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా చేతి వృత్తిదారులు పాల్గొనాలని వారు కోరారు.