
ధాన్యం దళారుల పాలయ్యేలా ఉంది
తణుకు అర్బన్: గోనె సంచులు లేక రైతులు ధాన్యా న్ని రోడ్లపైనే ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందని, ధాన్యం దళారుల పాలయ్యేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. మండలంలోని దువ్వ గ్రామంలో ఆదివారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని చివ రి గింజ వరకు ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే రైతులకు మద్దతుగా రోడ్డెక్కేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రానికి తోలుదామంటే ప్రభుత్వం గోనె సంచులు అందించలేదన్నారు. దీంతో రైతులు ధాన్యా న్ని రాశులుగా పోసి టార్పాలిన్లతో కప్పాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం కొనలేమని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం రైతుల దౌర్భా గ్యమని కారుమూరి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఉద్ధరిస్తామని ఎన్నికల ముందు నానా హంగామా చేసిన కూటమి ప్రభుత్వం, నేడు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గోనె సంచులు ఇవ్వకపోవడమేమిటని నిలదీశారు. ఇప్పటికే దళారులు ప్రవేశించి భారీగా ధర తగ్గించి కొనుగోలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే గాని, వ్యవసాయ శాఖాధికారులు గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు.
దువ్వలో తడిసిన ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడిన కారుమూరి