
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఎటు చూసినా భక్త జనమే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, స్వామివారి ఉచిత ప్రసాదం పంపిణీ ప్రాంతం, దర్శనం క్యూలైన్లు భక్తులతో పోటెత్తాయి. అలాగే ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.