
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.6 లక్షలను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తణుకు మండలం కానూరుకు చెందిన వీరమల్లు వెంకట్రావు రూ.5 లక్షలు, కాజా పడమరకు చెందిన గుబ్బల రామారావు రూ.లక్ష ఆలయ కార్యాలయంలో జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం వారికి స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు.
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
యలమంచిలి: విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం పోడూరు మండలం వద్దిపర్రు పంచాయతీ చింతలగరువుకు చెందిన గుడాల శ్రీసూర్యతేజ ప్రైవేట్ ఎలక్ట్రీషీయన్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్ పని ఉందని యలమంచిలికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నుంచి కబురు రావడంతో సూర్యతేజ పనికి వచ్చాడు. శిరగాలపల్లి వద్ద శనివారం పని చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కగా 11 కేవీ తీగలు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతునికి వివాహం కాలేదు. తల్లీదండ్రులు లక్ష్మీకుమారి, వెంకట సత్యనారాయణ, సోదరుడు ఉన్నారు.