
అమ్మోనియా గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత
పాలకోడేరు: పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామంలోని వశిష్ట ఆక్వా మైరెన్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అమ్మోనియా గ్యాస్ లీకై ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కార్మికుల కథనం ప్రకారం.. ఫీజర్ కూలింగ్ కోసం పైపు లైన్ ద్వారా అమ్మోనియా గ్యాస్ పంపుతుండగా హఠాత్తుగా పైపు పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో కొందరు కింద పడి గాయాలపాలుకాగా మరికొందరు గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో బిటిక గీతకు (ఒడిశా రాష్ట్రం రాయగడ), కౌసల్య ఒడిశా (కరిది), శ్యామ్ (రాయగడ)కు గాయాలు కాగా సునమ్ (రాయగడ), బి రాణి అమ్మోనియా గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇందులో ఇద్దరు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ప్రశ్నార్థకంగా రక్షణ చర్యలు
ఆక్వా పరిశ్రమల్లో రక్షణ చర్యలు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి బాల కార్మికులు కూడా ఇక్కడ ఆక్వా పరిశ్రమల్లో పనులు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఏ రాణి స్పందిస్తూ బాధితుల్లో, కార్మికుల్లో మైనర్లు ఉంటే శాఖ పరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా మైరెన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ తెలిపారు.