సంగెం: రాజ్యాంగం ద్వారానే పేదవర్గాలకు హక్కులు లభిస్తున్నాయని, రాజ్యాంగ ఫలాలను అందరికీ పంచిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మండలంలోని షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే బాబు జగ్జీవన్రామ్ అమలు జరిగేలా చూశాడని కొనియాడారు. ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు దక్కకుండా సామాజిక న్యాయానికి దూరంగా ఉన్నారనే ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణపై ఒకతాటిపైకి వచ్చాయన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని ప్రధాని మోదీ గుర్తించి అమలు చేశారన్నారు. సాంఘిక, ఆర్థిక రాజకీయ వివక్షతను రూపుమాపడం కోసం భవిష్యత్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ కేవలం మాదిగల కోసం మాత్రమే పరిమితం కాలేదని అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడి ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఉద్యోగాలు, మహిళల రక్షణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టులు సాధించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతాళ్ల రమేష్, మాజీ జెడ్పీటీసీలు గూడ సుదర్శన్రెడ్డి, మనోజ్గౌడ్, మాజీ ఎంపీడీఓ కుమారస్వామి, మాజీ సర్పంచ్లు సట్ల రాజు, పేరాల రాజు, కొయ్యల ఈశ్వరమ్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు కట్ల రాజశేఖర్, డాక్టర్ శరత్, శివ, కుమార్, రాజు, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ ఫలాలు పంచిన మహనీయుడు అంబేడ్కర్
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ