
గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే,
కలెక్టర్, అధికారులు
హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన నివాసానికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో వెళ్లిన వారు తిరిగి అదే ప్రాంతానికి వెళా ల్సి ఉంటుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో డిప్యుటేషన్పై వచ్చిన ఆయన తిరిగి ఆసిఫాబాద్కు వెళ్తాననే బెంగ పెట్టుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్
తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి భౌతికకాయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి