
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
న్యూశాయంపేట : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీ ఎఫ్) భీమా నాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్లో బుధవారం ప్లాస్టిక్ ప్రీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం కాంప్లెక్స్ ఆవరణలోని ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించి, ఆవరణను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వేవర్క్స్ సెక్షన్ల తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్నీరోడ్ సెక్షన్లో చేపట్టనున్న రైల్వే ఎన్ఐ ఇంజనీరింగ్ వర్క్స్ లోకేషన్ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే అధికారులు తనిఖీ చేశారు. రైల్వే ఏడీఆర్ఎం ఆపరేటింగ్ విభాగం గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఎన్ఐ బ్లాక్ సెక్షన్లను పరిశీలించి తనిఖీ చేసి పలు సాంకేతిక విషయాలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా బెల్లంపల్లి–రెచ్నీ మధ్య ఎన్ఐ ఇంజనీరింగ్ బ్లాక్ పనులు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని, దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట–బల్లార్షా రూట్లలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, దూరం తగ్గించి నడిపిస్తున్నట్లు అధికారులు వివరించారు.
1,220 దరఖాస్తుల స్వీకరణ
హన్మకొండ అర్బన్ : జిల్లావ్యాప్తంగా 14 గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులనుంచి 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సదసుల్లో సర్వే నంబర్ల మిస్సింగ్–90, పెండింగ్ మ్యూటేషన్–17, డీఎస్ పెండింగ్–49, ఎక్స్టెంట్–113, అసైన్డ్ భూ సమస్యలు–179, సక్సేషన్–101, ఇతర సమస్యలపై 625లతో పాటు తదితర సమస్యలపై మొత్తం 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను
సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం ఏనుమాములలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలాజీనగర్లో రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, సిబ్బంది పాల్గొన్నారు.
హిందీ పరీక్షకు
8మంది హాజరు
విద్యారణ్యపురి : జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్షకు మొత్తం 12మందికి 8మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ముగ్గురు, బస్టాండ్ రోడ్డులోని ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో ఇద్దరు, పెట్రోల్ పంపు బాలికల హైస్కూల్ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాలి