రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్‌ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్‌ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టి

Jun 4 2025 1:08 AM | Updated on Jun 4 2025 7:32 PM

వరంగల

వరంగల్‌

గతంలోనే 1,100 పడకలతో సేవలందించిన ఎంజీఎం

రాష్ట్ర ప్రభుత్వంనుంచి కరోనా కిట్‌లు రాగానే పరీక్షలు షురూ

ఇప్పటివరకు కరోనా ప్రభావం లేదంటున్న వరంగల్‌, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు

సాక్షి, వరంగల్‌: మున్ముందు కరోనా మహమ్మారి వస్తే ముందస్తుగానే కట్టడి చేసేందుకు వరంగల్‌, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్య విభాగాధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ మెమోరియల్‌(ఎంజీఎం) ఆస్పత్రితోపాటు గతంలో సేవలందించిన వివిధ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలున్నాయనే వివరాలను సేకరిస్తున్నా రు. ఈ జాబితాను ఆయా జిల్లాల విభాగాధికారులు కలెక్టర్‌ల ద్వారా ఉన్నతాధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేసేలా సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులు, ఒకవేళ ప్రబళితే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కరోనా ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లలో పాజిటివ్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించి వేలాది మంది ప్రాణా లు కాపాడిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికీ 500 నుంచి 800 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండడంతో ఏ పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండడం కలిసొచ్చే అంశమని వరంగల్‌ జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు భావిస్తున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్‌ యాంటీ జెన్‌, ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు రాష్ట్ర ప్రభుత్వంనుంచి జిల్లాలకు రాగానే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసే వీలుంటుందని అంటున్నారు.

వాతావరణ మార్పులతో జ్వరాలు..

మే నెల మూడో వారం నుంచి వాతావరణం చల్లబడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలోని ఫీవర్‌ వార్డులోనూ పదుల సంఖ్య లో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి సీజన్‌ వ్యాధులుగానే పరిగణించి వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకొని భయపడవద్దని, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయని అంటున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

20 పడకలతో ప్రత్యేక వార్డు..

ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచాం. గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పనిచేసిన వైద్యులు, వారి బృందం అందుబాటులో ఉంది. దీనికితోడు 500 నుంచి 800 ఆక్సిజన్‌ బెడ్‌లు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద ఆపద వచ్చినా అదుకునేందుకు ఈ పెద్దాసుపత్రి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కరోనాతో ఎంజీఎంలో ఎవరూ చేరలేదు.

– కిశోర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement