
పేదలకు నాణ్యమైన సన్న బియ్యం
వనపర్తి రూరల్: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని.. బయటి వ్యక్తులకు విక్రయించరాదని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఆయన పెబ్బేరులోని రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారా లేదా అని డీలర్ను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం నాణ్యత ఎలా ఉందని లబ్ధిదారులతో ఆరా తీశారు. ప్రజలకు సరైన తూకంతో బియ్యం పంపిణీ చేయాలని.. ఎలాంటి లోపాలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. అధికారులు మీ గ్రామానికి వచ్చారని.. భూ సమస్యలను నిర్ణీత ప్రోఫార్మలో పూరించి రెవెన్యూ సదస్సులో ఇవ్వాలని పరిశీలించి పరిష్కరిస్తారని వివరించారు.