
వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి పనుల కోసం ఆయా వార్డు కార్పొరేటర్లకు నిధులు కేటాయించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా మేయర్ పీఠాన్ని కై వసం చేసుకున్న కూటమి ప్రభుత్వం, కనీసం పాలననైనా ప్రజాస్వామికంగా నిర్వహించాలని ఆయన హితవు పలికారు. పార్టీలకతీతంగా ఆలోచించి ప్రజా సమస్యలు, వార్డు అభివృద్ధి కోసం దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా, ప్రతి వార్డులో ఆయా వార్డు కార్పొరేటర్లు సూచించిన ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై కూటమి పార్టీల మేయర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పార్టీలకతీతంగా ప్రజల కోసం ఏ విధంగా పాలన సాగిందో, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజా శ్రేయస్సు కోసం పాలన చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు.