
చైన్నె –తూత్తుకుడి విమానంలో ఇంజిన్ లోపం
– రన్వేపైనే ఆగిపోయిన వైనం
కొరుక్కుపేట: చైనె – తూత్తుకుడి విమానంలో ఇంజిన్ లోపం కారణంగా రన్ వేపైనే విమానం ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చైన్నె నుంచి తూత్తుకుడికి వెళ్లే విమానం ఆదివారం ఉదయం 10.10 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 65 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 70 మంది ఉన్నారు. విమానం రన్ వే వద్దకు వస్తున్న సమయంలో పైలట్ విమానం ఇంజిన్లో వైఫల్యం ఉందని గుర్తించారు. అనంతరం విమానాన్ని గాల్లోకి ఎగరవేయడం ప్రమాదకరమని గ్రహించి అతను వెంటనే విమానాన్ని ఆపి వేసి ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు తెలియజేశారు. దీని తరువాత సిబ్బంది విమానానికి టో ట్రక్కును ఉపయోగించి మరమ్మతులు చేపట్టారు. ఆ తరువాత చైన్నె నుంచి తూత్తుకుడికి ఆలస్యంగా బయలుదేరింది. ఫైలట్ సకాలంలో ఇంజిన్ లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
మాదక ద్రవ్యాలకు
వ్యతిరేకంగా ప్రచారం
సాక్షి, చైన్నె : మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ప్రచారానికి హిందూస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీకారం చుట్టింది. మార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఎస్పీ దీపక్ కౌశిక్ నాయకత్వంలో ఆదివారం అవగాహన ప్రచారం ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యకరంగా ఎదురయ్యే సమస్యలు, జీవితం మీద పడే ప్రభావం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ కౌశిక్ మాట్లాడుతూ, యువత పెడదోవ పట్టకుండా, వారిని పరిరక్షించే విధంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశామన్నారు. వీటి వాడకం వల్ల జీవితం నాశనం కావడమేకాకుండా, కుటుంబాలు సైతం తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన వాస్తవిక అంశాలతో కొన్ని కథలను వివరించారు. హిందూస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన , భావోద్వేపరంగా ఈ అవగాహన ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నామన్నారు.
రియల్ ప్రకటనలపై మరిన్ని ఆంక్షలు
సాక్షి, చైన్నె : రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రకటనలకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణ, స్థల క్రమబద్ధీకరణ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. విచ్చల విడిగా ఆయా సంస్థలు పోటీలు పడి మరీ టీవీ,ఎఫ్ఎం, సామాజిక మాధ్యమాలు, పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకుంటూ వస్తున్నాయి.అయితే, కొన్ని ప్రకటనల కారణంగా ప్రజలు మోసగించబడుతున్నట్టు, అదే సమయంలో అనేక ప్రకటనలలో సెలబట్రీలు సైతం ఉండటం వంటి అంశాలతో సాగుతున్న పరిణామాలను పరిగణించి కొన్ని ఆంక్షలు, నిబంధనలు విధించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రకటనలలో క్యూర్ కోడ్, సంబంధిత సంస్థలకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఆయా సంస్థల గ్రూఫ్ల వివరాలను తప్పని సరిగాపొందు పరిచే విధంగా పాటుగా మరికొన్ని ఆంక్షలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అన్బుమణి అవుట్
– పీఎంకే లెటర్ పాడ్లో పేరుమాయం
సాక్షి, చైన్నె: పీఎంకేలో వివాదం మరింత రక్తికట్టిస్తోంది. అన్బుమణిని ఆ పార్టీ నుంచి తొలగించారా? అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన పేరు తొలగించి లెటర్ పాడ్ విడుదల చేయడం ఆదివారం చర్చకు దారి తీసింది. వివరాలు.. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్యజరుగుతున్న వార్లో మరో కీలక మలుపు ఆదివారం జరిగింది. పార్టీలో 21 మందిని నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో రాందాసు ప్రకటన విడుదల చేశారు. పార్టీ లెటర్ పాడ్తో కూడిన ఈ ప్రకటనలో అన్బుమణి పేరు గల్లంతైంది. ఇది అన్బుమణి మద్దతు దారుల్ని విస్మయంలో పడేసింది. అదే సమయంలో అన్బుమణిని కూడా పార్టీ నుంచి తప్పించేందుకు రాందాసు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే ఆయన పేరునులెటర్ పాడ్ నుంచి తొలగించనట్టు సమాచారాలు వెలువడ్డాయి. తండ్రి, తనయుడి మధ్య వివాదం బయలు దేరినప్పటి నుంచి పలువురి తొలగింపు, పలువురికి కొత్త పదవులు కేటాయిస్తూ రాందాసు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్బుమణి పేరును లాటర్ పాడ్లో పొందుపరుస్తూ విడుదల చేశారు. తాజాగా అది కూడా గల్లంతు కావడం పీఎంకేలో చర్చకు దారి తీసింది. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తప్పించబోతున్నారన్న సంకేతాల నేపథ్యంలో ఈ వివాదం మరింతగా రక్తికట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్బుమణి పీఎంకేను చీల్చి కొత్త పార్టీ ప్రకటిస్తారా? అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చినట్లయ్యింది.

చైన్నె –తూత్తుకుడి విమానంలో ఇంజిన్ లోపం